కేసులు పెరిగాయి.. స్వీయజాగ్రత్తే మందు

ABN , First Publish Date - 2020-05-31T08:52:07+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం హైదరాబాద్‌ నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వీయజాగ్రత్తలు పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ ప్రజలకు...

కేసులు పెరిగాయి.. స్వీయజాగ్రత్తే మందు

అధికారులకు సహకరించండి: కమిషనర్‌ 


హైదరాబాద్‌ సిటీ, మే 30 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపు అనంతరం హైదరాబాద్‌ నగరంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో స్వీయజాగ్రత్తలు పాటించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనల్లో వెసులుబాటు ఇవ్వడంతో అనవసరంగా బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య, పోలీస్‌ శాఖ నిరంతరం కృషి చేస్తున్నాయని, ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుందని, తెలియకుండానే వైరస్‌ సోకే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ కింద పేర్కొన్న జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.


ఉద్యోగులు, వ్యాపారస్తులు మినహా మిగిలిన కుటుంబ సభ్యులు సాధ్యమైనంత మేర రోడ్లపైకి రావద్దు.

పదేళ్ల పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలి. 

నిత్యావసరాలు, ఇతరత్రా వస్తువుల కొనుగోలుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మాస్క్‌లు ధరించకుండా బయటకు వెళ్లకూడదు. వైరస్‌ సోకకుండా మాస్క్‌లు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి. 

పని ప్రదేశంలో తరచూ చేతులు శుభ్రం చేసుకునేందుకు నీళ్లు, సబ్బు, శానిటైజర్‌ సదుపాయం కల్పించాలి. భౌతిక దూరం పాటించాలి. 

దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, తలనొప్పి లాంటి లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

బీపీ, షుగర్‌, గుండెజబ్బులు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. 

పరిశుభ్రతతో పాటించాలి.

Updated Date - 2020-05-31T08:52:07+05:30 IST