‘కరోనా’ డ్యూటీలో టీచర్లు
ABN , First Publish Date - 2020-04-03T09:17:40+05:30 IST
‘కరోనా’ డ్యూటీలో టీచర్లు
డాక్టర్లు, వలంటీర్లకు తోడుగా ఉండేలా ప్రభుత్వం చర్యలు
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కార్యకలాపాల్లో ఉపాధ్యాయులను మరింత భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎక్కడెక్కడ వారి సేవలు అవసరం, ఎవరు ఏ డ్యూటీ చేయాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. స్థానిక అవసరాలను బట్టి ఏయే కేటగిరీల టీచర్ల భాగస్వామ్యం అవసరమో ఉన్నతాధికారులు నిర్ణయిస్తున్నారు. అయితే మహిళా టీచర్లకు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, వయసు పైబడిన వారికి మినహాయింపు ఇస్తున్నారు. ‘కరోనా’ డ్యూటీలో స్వచ్ఛందంగా పాలుపంచుకునే టీచర్ల జాబితాలను రూపొందించి, వారిని సమీపంలోని తహసీల్దార్ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు.