ప్రజలను నమ్మించి మోసగించడంతో జగన్ సిద్ధహస్తుడు: Tulasireddy
ABN , First Publish Date - 2022-04-26T18:11:52+05:30 IST
ప్రజలను నమ్మించి మోసగించడంలో ముఖ్యమంత్రి జగన్ సిద్ధ హస్తుడు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.
అమరావతి: ప్రజలను నమ్మించి మోసగించడంలో ముఖ్యమంత్రి జగన్ సిద్ధ హస్తుడు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మాట తప్పడం- మడమ తిప్పడం జగన్ దినచర్య అని అన్నారు. జగన్ పేరు వింటానే విశ్వసనీయత అనే పదం పారిపోతుందన్నారు. రైతులను, రైతు కూలీలను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను, మద్యం విషయంలో మహిళలను, పెళ్లి కానుక విషయంలో చెళ్ళెమ్మలను, అగ్రిగోల్డ్ బాధితులను ఇలా అందరినీ మోసగించారని దుయ్యబట్టారు. ‘‘ఉద్యోగులకు సబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. సకాలంలో పీఆర్సీ అమలు చేస్తాం. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తాం. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తాం అని ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా పేర్కొనడం జరిగింది’’ చెప్పారు. అధికారంలోకి వచ్చాక పై హామీలను విస్మరించారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా హామీలను అమలు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.