AP: సోమువీర్రాజుపై సుంకర పద్మశ్రీ సెటైర్లు

ABN , First Publish Date - 2021-12-29T14:49:21+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు విసిరారు.

AP: సోమువీర్రాజుపై సుంకర పద్మశ్రీ సెటైర్లు

విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సెటైర్లు విసిరారు. విజయవాడలో బీజేపీ నిర్వహించింది ప్రజాగ్రహ సభ కాదు బీజేపీ సొల్లు సభ అని దుయ్యబట్టారు. సోము వీర్రాజు ఈసారి కూడా బీజేపీ సోల్లే చెప్పారు తప్ప అసలు విషయాలు మాట్లాడలేదన్నారు. సోము వీర్రాజును ఒకసారి మానసిక వైద్యుడికి చూపించాలని స్థానిక బీజేపీ నేతలను కోరుతున్నా అంటూ యెద్దేవా చేశారు. రాష్ట్రానికి అస్సలు బీజేపీ ఏం న్యాయం చేసిందో చెప్పే దమ్ము సోము వీర్రాజుకు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, అమరావతి రాజధానిని గాలికి వదిలేసిన బీజేపీ సొంత డబ్బా కొట్టుకోవడంలో  మాత్రం ఫస్ట్‌లో ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మూడు సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని సుంకర తెలిపారు.


7 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజధాని నిర్మాణానికి మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. 70 రూపాయలకి, 50 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తామని సోము వీర్రాజు అనడం చూస్తే జాలేస్తోందని అన్నారు. అదే 70 రూపాయలకి లీటర్ పెట్రోల్ ఇస్తాం అనే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని నిలదీశారు. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుంటే సోము వీర్రాజు ఏ కలుగులో దాక్కున్నారని అడిగారు. వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని సోము వీర్రాజు ప్రధాని మోదీని ప్రశ్నించాలన్నారు. ‘‘సోము వీర్రాజుగారు.... మీ ఉత్తరకుమార ప్రగల్భాలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి’’ అంటూ సుంకర పద్మశ్రీ హితవు పలికారు. 

Updated Date - 2021-12-29T14:49:21+05:30 IST