చేరికలపైనే కాంగ్రెస్ దృష్టి!
ABN , First Publish Date - 2022-07-04T09:38:22+05:30 IST
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు చేరికల అంశంపైనే కాంగ్రెస్ ప్ర ధానంగా దృష్టి పెడుతోంది.
- ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి
- టీఆర్ఎస్కు రాజీనామా చేసిన బడంగ్పేట్ మేయర్
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనంటూ ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు చేరికల అంశంపైనే కాంగ్రెస్ ప్ర ధానంగా దృష్టి పెడుతోంది. ఈ నెల 5, 6 తేదీల్లో పార్టీలో భారీ చేరికలకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చేరికలు ఇటు అధికార టీఆర్ఎస్ నుంచి, అటు ప్రత్యామ్నాయ రేసులో పోటీ ప డుతున్న బీజేపీ నుంచీ ఉండేలా చూసుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ నేత, బడంగ్పేట మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్లో చేరిక ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆ మె టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఆమెతో పాటు మరో ఇద్దరు టీఆర్ఎస్ కార్పొరేటర్లూ హస్తం గూటికి వెళ్లనున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను, పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభనూ నిర్వహించిన బీజేపీ.. ప్రస్తుతం ఆ సభ విజయోత్సాహాన్ని ఆస్వాదిస్తోంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు హైదరాబాద్లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తో ఘన స్వాగతం పలికిన టీఆర్ఎస్.. తద్వారా బలప్రదర్శన చే సింది. రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో వార్తల్లో నిలుస్తోంది. అయితే బీజేపీ, టీఆర్ఎ్సల ఉత్సాహానికి చెక్ పెట్టేందుకు ఆయా పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలను కాంగ్రెస్ తెరపైకి తెస్తోంది. కాగా.. ఆదివారం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. 5,6 తేదీల్లో చేరికలకు సంబంధించిన జాబితాకు అధిష్ఠానం ఆమో దం కోసం ఆయన హస్తినకు వెళ్లినట్లు తెలుస్తోంది.
శబ్ద కాలుష్యం తప్ప ఒరిగింది శూన్యం
ప్రధాని మోదీ సభపై రేవంత్రెడ్డి వ్యాఖ్య
ప్రధాని మోదీ సహా యావత్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వస్తుంటే విభజన చట్టంలో హామీల అమలుపై ప్రణాళిక ప్రకటిస్తారని ఆశించామని, కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు, శబ్ద కాలుష్యం మినహా ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.బీజేపీ కార్యవర్గ సమావేశాలు, మోదీ సభతో ప్రజలకు ఒరిగింది శూన్యమని అన్నారు. వారం రోజులుగా తెలంగాణ వీధుల్లో బీజేపీ, టీఆర్ఎస్ ప్లెక్సీల పంచాయితీలు వీధి నాటకాలను తలపించాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడేళ్లుగా కేసీఆర్ అవినీతిపై విచారణకు సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర పార్టీ నాయకులు హెచ్చరికలు చేస్తున్నారు కానీ.. ఆ అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బీజేపీ సభలో ప్రధాని మోదీ.. తన ప్రసంగంలో తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించలేదని, కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి ఊసెత్తకుండా మిత్రధర్మం పాటించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు.