శ్రీకాకుళం జిల్లా ఎస్సీ కమిటీ సమావేశంలో గందరగోళం
ABN , First Publish Date - 2020-02-19T22:32:32+05:30 IST
శ్రీకాకుళంలో ఎస్సీ సభా సంఘం సమావేశం రసాభాసగా మారింది.
శ్రీకాకుళంలో ఎస్సీ సభా సంఘం సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు నేతృత్వంలోని 7గురు సభ్యుల కమిటీ జిల్లా పర్యటనకు వచ్చింది. అదే సమయంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న దళితులు సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్సార్ నవశకం పేరుతో గ్రామాల్లో దళితుల భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ ఆరోపించారు. సమావేశ మందిరంలో టేబుళ్లు ఎక్కి నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ దళిత ద్రోహి అంటూ ఆరోపించారు. దళితనేతల నినాదాలతో సమావేశ మందిరం దద్దరిల్లిపోయింది.
ఊహించని ఈ ఘటనతో కమిటీ సభ్యులు విస్తుపోయారు. కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు దళితులను శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గ్రామాల్లో ఏళ్ల తరబడి దళితుల ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం ఇళ్ల పట్టాల పేరుతో స్వాధీనం చేసుకుంటోంది. దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో గత కొద్ది రోజులుగా దళితులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. అధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఎస్సీ కమిటీ ముందు తమ నిరసనను వ్యక్తం చేశారు.