కలహాలు లేని ‘కృష్ణా’ పంపకాలు సాధ్యమే

ABN , First Publish Date - 2021-07-09T06:28:44+05:30 IST

నదీజలాల పంపకాలకు సంబంధించిన వివాదాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రమే పరిమితమైనవి కావు. నదీపరివాహ ప్రాంతంలో భాగంగా ఉన్న ప్రతి రాష్ట్రమూ...

కలహాలు లేని ‘కృష్ణా’ పంపకాలు సాధ్యమే

నదీజలాల పంపకాలకు సంబంధించిన వివాదాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు మాత్రమే పరిమితమైనవి కావు. నదీపరివాహ ప్రాంతంలో భాగంగా ఉన్న ప్రతి రాష్ట్రమూ ఒక జలజగడాన్ని ఎదుర్కొంటూనే ఉంది. ఈ కలహాలలో కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. పరీవాహప్రాంత రాష్ట్రాలకు నదీజలాల పంపకాలు చేసే వ్యవస్థలే ఈ వివాదాలకు తావిస్తున్నాయి. నీటి కేటాయింపులకు అవి కాలం చెల్లిన, అశాస్త్రీయ భావనలను అనుసరించడం వల్లే ఘర్షణలు తలెత్తుతున్నాయి. వాతావరణ పరివర్తన శీలతను పరిగణనలోకి తీసుకోకపోవడం మరొక కారణం. నదిలో నీటి పరిమాణం ప్రతి సంవత్సరమూ ఒకే విధంగా ఉండదు. ఆ మాటకొస్తే ఒకే సంవత్సరంలో వివిధ రుతువులలో విభిన్న పరిమాణాలలో ఉంటుంది. ఈ మార్పులను పరిగణనలోకి తీసుకోకుండా కేటాయింపులు జరపడం వల్ల ముఖ్యంగా వర్షపాతం తక్కువగా ఉన్న సంవత్సరంలో వివాదాలు అనివార్యమవుతున్నాయి. కేటాయింపులను అమలుపరిచే యంత్రాంగమేదీ లేకపోవడం మరో ముఖ్య కారణం. అలాగే ఒక రాష్ట్రం పరిధిలో ఒక నది జలాలను అదే రాష్ట్రంలోని మరో నది పరివాహక ప్రాంతానికి బదిలీ చేసే విషయంలో మార్గదర్శక సూత్రాలు లేకపోవడం కూడా వివాదాలకు దారితీస్తోంది. నదీజలాలను పొదుపుగా, గరిష్ఠ స్థాయిలో ప్రయోజనకరంగా ఉపయోగించుకునేందుకు ఎటువంటి ప్రోత్సాహకాలు లేకపోవడం కూడా ఒక కారణమే. అందుబాటులో ఉన్న జలాలను పంపకం చేయడం కాకుండా, వాటివల్ల సమకూరే ప్రయోజనాలను పంచేందుకు వ్యవస్థలు ఏవీలేవు. అసలు ఇటువంటి అంశమేదీ మన ఆలోచనల్లోనే లేదు కదా. ప్రపంచదేశాలేమో ఈ విషయంలో ప్రగతిశీలంగా పురోగమిస్తున్నాయి. కృష్ణానదీజలాల విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య ప్రస్తుత వివాదానికి ప్రస్తావిత అంశాలన్నీ కారణాలుగా ఉన్నాయి. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ‘కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రైబ్యునల్-–2 (కెడబ్ల్యుడిటి–-2) అవిభక్త రాష్ట్రానికి 1005 టిఎంసీల నీటిని కేటాయించింది. ఈ కేటాయింపును తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంచుకోవాలి. కృష్ణా పరీవాహ ప్రాంతంలో 62 శాతం తెలంగాణలో, 32 శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఈ మేరకు, ఉమ్మడి కేటాయింపును తెలంగాణ, ఆంధ్రలకు పంపకం చేసే ప్రక్రియను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. అయితే వివిధ చారిత్రక, సంక్లిష్ట కారణాల వల్ల పంపకాలపై ఏకాభిప్రాయం కొరవడింది. ప్రస్తుత వివాదానికి ఇదే మూలం. విడివిడి రాష్ట్రాలుగా ఆవిర్భవించిన ఏడు సంవత్సరాల తరువాత కూడా కృష్ణానదీజలాల్లో తమ వాటా ఎంత అనే విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు స్పష్టత లేదు!


ఈ అస్పష్టత, గందరగోళానికి భౌగోళికత కూడా ఒక ప్రధాన కారణం. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల (ఈ రెండిటి మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 600 టిఎంసీలు) పై ఉభయ తెలుగురాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి. వ్యవసాయ అవసరాలకు ఆ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసుకునేందుకు, విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకునేందుకు ఉభయ రాష్ట్రాలకు సొంత వ్యవస్థలు ఉన్నాయి. తమకు అవసరమైనప్పుడల్లా నీటిని వినియోగించుకునేందుకు రెండు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది. అయితే అటు శ్రీశైలంలోనూ ఇటు నాగార్జునసాగర్ లోనూ ఒకే జలాశయం నుంచి వారు నీటిని వినియోగించుకోవల్సి ఉంది. తెలంగాణ ఏర్పడక ముందు ఈ సదుపాయాలు ఒకే వ్యవస్థ ఆధ్వర్యంలో ఉండేవి. 2014కి ముందు ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు అవసరమైతే అప్పుడు నీటిని విడుదల చేస్తుండేది. అయితే ఈ విషయంలో తమపై వివక్ష చూపుతున్నారని తెలంగాణ ఫిర్యాదు చేసేది. అంతకు మించి ఏమీ చేయగల అధికారాలు ఆ ప్రాంతానికి లేవు. అయితే తెలంగాణ ఇప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం. దానికి సంపూర్ణ అధికారాలు, సొంత వ్యవస్థలు ఉన్నాయి. తన సొంత గేట్ల ద్వారా నీటిని విడుదల చేసుకోగలుగుతుంది లేదా నిలిపివేసుకుంటుంది. అయితే ఉభయ రాష్ట్రాలు ఎప్పుడు, ఎలా, ఏ మేరకు నీటిని వినియోగించుకోవాలి అనే విషయమై ఇరు రాష్ట్రాలకు అంగీకారయోగ్యమైన మార్గదర్శకాలు, నియమ నిబంధనలు లేవు. ఈ కారణంగా రెండు రాష్ట్రాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. తత్ఫలితమే ఎడతెగని వివాదాలు. 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 మే 20న ఒక జీవో (నెంబర్ 203) ను జారీ చేసింది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి మళ్లింపును మరింతగా అధికం చేయడమే ఆ జీవో లక్ష్యం. ఇప్పటికే శ్రీశైలం నుంచి నీటి మళ్లింపునకు ఒక సదుపాయం ఉంది. అది పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. దీనిద్వారా రోజూ3 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తున్నారు. ఆ మళ్లింపును మరో 80,000 క్యూసెక్కుల మేరకు ఎక్కువ చేసేందుకే జీవో 203ను ఉద్దేశించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రోజూ ఆ జలాశయం నుంచి మళ్లించే నీటి పరిమాణం 10 టీఎంసీలకు పెరగనున్నది. ఇది తమ ప్రయోజనాలకు పూర్తి విఘాతమని తెలంగాణ భావిస్తోంది. అసలు మామూలుగా 3 టీఎంసీల నీటి మళ్ళింపే చట్టవిరుద్ధమనేది తెలంగాణ వాదన. శ్రీశైలం ప్రాజెక్టును పూర్తిగా విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉద్దేశించినందున ఆ జలాశయంలోని నీటిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదని తెలంగాణ విశ్వసిస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ నీటిని గ్రావిటీ ఆధారిత మళ్లింపునకు పూనుకోవడంతో శ్రీశైలం జలాశయం ఒక్క 20 రోజులలోనే ఖాళీ కాగలదని తెలంగాణ భయపడుతోంది. తమ ఎత్తిపోతల పథకాల కింద సేద్యానికి నీరు లభించదని కలవరపడుతోంది. ఇక ఆంధ్రప్రదేశేమో కృష్ణాబేసిన్‌లోని వరదజలాలను వర్షాభావ ప్రాంతమైన రాయలసీమకు మళ్లిస్తున్నామని వాదిస్తోంది. అయితే ఈ మళ్లింపులను అమలుపరిచేందుకు సరైన వ్యవస్థలు లేనందున ఉభయ రాష్ట్రాలూ తమ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతోందని భయపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ జీవో 203తో కలవరం చెందిన తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబేసిన్‌లో మరో ఐదు కొత్త ప్రాజెక్టులు నిర్మించదలచినట్టు జూన్ 19న ప్రకటించింది. వీటి వల్ల అదనంగా ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం ఏర్పడగలదని అంచనా. అయితే వాటి నిర్మాణానికి సుదీర్ఘవ్యవధి పడుతుంది. ఆర్థిక వనరులూ చాలా అవసరం. జీవో 203 అమలును తక్షణమే నిలిపివేయించేందుకు అవి తోడ్పడవు. 


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలలోకి రోజూ ఎంత నీరు ప్రవహిస్తోంది, వాటి నుంచి ఎంత నీరు విడుదలవుతోంది, విద్యుత్ వినియోగానికి నీటిని ఏ మేరకు వినియోగిస్తున్నారు, ఇతర నదీపరీవాహక ప్రాంతాలకు ఎంత నీటిని మళ్లిస్తున్నారు తదితర అంశాలపై ఈ వ్యాసకర్తలు సమగ్ర అధ్యయనం నిర్వహించారు. ఉభయ తెలుగురాష్ట్రాలు కృష్ణాజలాలను సరిసమానంగా ఉపయోగించుకునేందుకు అవకాశముంది. అయితే ప్రవాహ సామర్థ్యాలను శాస్త్రీయంగా అర్థం చేసుకోవల్సిన అవసరముంది. వివాదరహిత పంపకాలు అప్పుడే సాధ్యం. ఒక రాష్ట్రానికి సమకూరే లబ్ధి రెండోరాష్ట్రానికి నష్టంగా పరిణమించదు. ఉభయ రాష్ట్రాలు సమగ్ర చర్చల ద్వారా ఒక అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రావచ్చు. అందుకు మేము ఈ కింద సూచించిన సూత్రాలను అనుసరించాలి. 


కృష్ణాబేసిన్‌లో ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న నీటి పరిమాణాన్ని ఉభయ రాష్ట్రాలు అంగీకరించి తీరాలి. తమ తమ పరిధిలోని కృష్ణా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులను మాత్రమే అవి ఉపయోగించుకోవల్సిన అవసరముంది. ఉభయ రాష్ట్రాలకు నిర్దిష్ట కేటాయింపులను ఖరారు చేసిన తరువాత ఏ రాష్ట్రమైనా ఆ కేటాయింపు నుంచి మాత్రమే తమ పరిధిలోని ఇతర నదీ పరివాహకప్రాంతాలకు నీటిని మళ్ళించుకోవాలి. అప్పుడు రెండో రాష్ట్రానికి దీనిపై ఎటువంటి అభ్యంతరం ఉండబోదు. అంతర్ పరీవాహక ప్రాంతాల మధ్య నీటి మళ్ళింపులకు కొత్త పథకాలకు పూనుకోకూడదు. ఉమ్మడి రాష్ట్రంలో అటువంటి పథకాలు వేటికైనా నిర్ణయం తీసుకుని ఉన్నాసరే వాటి అమలును నిలిపివేయాలి. ఉభయ రాష్ట్రాలకు కొత్తగా నీటి కేటాయింపులను నిర్ధారించిన తరువాతనే సదురు నీటి మళ్లింపు పథకాల గురించి ఆలోచించాలి. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ఎప్పుడైనా సరే నీటిని తీసుకోవచ్చు. అయితే ఆ నీటి పరిమాణం ఆంధ్రప్రదేశ్ నీటి వాడకం పరిమాణానికి మించకూడదు. జలాశయాలు నిండుగా ఉన్నప్పుడు మాత్రమే నీటి మళ్లింపులు జరపాలి. ఆంధ్రప్రదేశ్ అలా చేసినప్పుడు మాత్రమే తెలంగాణ ప్రయోజనాలకు హాని జరగదు. కొత్త అంగీకారయోగ్య ఒప్పందంలో ఈ నిబంధన భాగంగా ఉండి తీరాలి. దీనితోపాటు దాన్ని అమలుపరిచేందుకు స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు విషయం కూడా ఆ ఒప్పందంలో భాగం కావాలి. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. ఉభయ రాష్ట్రాల కృష్ణాజలాల మొత్తం వినియోగం, సదరు బేసిన్‌లో తెలంగాణ వాటాకు మించకూడదు. ప్రతి రాష్ట్రమూ ఏ ప్రయోజనాలకు ఎంత నీటిని ఉపయోగించుకునేది కచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఈ నిర్ణీత వాటాలు వార్షిక ప్రాతిపదికన నిర్ణయం కావాలి. వర్షాభావ సంవత్సరాలలో నీటి ఎద్దడిని నివారించుకునేందుకు ఇది తప్పనిసరి. ఏ రాష్ట్రమైనా నీటిని అత్యవసరంగా ఉపయోగించుకోవాల్సి వచ్చినప్పుడు సంప్రదింపులతో ఆ నీటికి ధరను ఖరారు చేసుకుని రెండో రాష్ట్రానికి చెల్లించాలి.


కృష్ణాజలాల పంపకాలకు పై అంశాలు షరతులు కావు, ప్రాతిపదికలు మాత్రమే. చర్చలు, సంప్రదింపులను నిర్దిష్టకాల వ్యవధిలో పూర్తిచేసుకుని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి. కేంద్రప్రభుత్వం తోడ్పాటును తీసుకోకుండా తమకుతాముగా ఒక ఒప్పందానికి రావడం ఉభయ రాష్ట్రాలకూ శ్రేయస్కరం. ఆ ఒప్పందానికి చట్టబద్ధత కల్పించేందుకు, అమలుకు కేంద్రప్రభుత్వ సహాయాన్ని తీసుకోవాలి. రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా పౌరసమాజం ఉభయరాష్ట్రాల మధ్య చర్చలు ఫలప్రదంగా జరిగేందుకు సహకరించాలి. 

డాక్టర్ బిక్షం గుజ్జా

అంతర్జాతీయ జలవిధాన నిపుణుడు

డాక్టర్ కె.శివకుమార్ 

భారత అణుశక్తి విభాగ విశ్రాంత శాస్త్రవేత్త

Updated Date - 2021-07-09T06:28:44+05:30 IST