కియా మోటార్స్ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్
ABN , First Publish Date - 2020-08-08T06:24:20+05:30 IST
దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ కార్పొరేషన్.. అర్బన్ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ను విడుదల చేసింది. సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అయిన సోనెట్ను వచ్చే నెలలో భారత మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసేందుకు...
- వచ్చే నెలలో దేశీ మార్కెట్లోకి విడుదల
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ కార్పొరేషన్.. అర్బన్ కాంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ను విడుదల చేసింది. సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ అయిన సోనెట్ను వచ్చే నెలలో భారత మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేసేందుకు కియా మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంట్లో కంపెనీ ఈ ఎస్యూవీని ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడి నుంచే సోనెట్ను విదేశాలకు ఎగుమతి చేయనుంది. అనంతపురం ప్లాంట్లో కంపెనీ ఉత్పత్తి చేసిన మూడో మోడల్ ఇది. కియా ఇప్పటికే సెల్టోస్, కార్నివాల్ కార్లను ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో షోలో సోనెట్ను కియా ప్రదర్శించింది. హ్యుండయ్ వెన్యూ, మారుతి సుజుకీ విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవీ 300కి సోనెట్ గట్టి పోటీనిస్తుందని అంచనా. అంతేకాకుండా త్వరలో మార్కెట్లోకి రానున్న టయోటా కిర్లోస్కర్.. అర్బన్ క్రూయిజర్, నిస్సాన్ మాగ్నెట్కు కూడా ఈ కాంపాక్ట్ ఎస్యూవీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
మిల్లీనియల్, జెన్ జెడ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డిజైన్, ఫన్ టు డ్రైవ్ డైనమిక్స్, సరికొత్త కియా హై టెక్ ఫీచర్లతో సోనెట్ను రూపొందిచించినట్లు కియా మోటార్స్ ప్రెసిడెంట్, సీఈఓ సుంగ్ సాంగ్ వెల్లడించారు. 1.2 లీటర్, 1 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్స్తో పాటు 1.5 లీటర్ డీజిల్ వేరియంట్స్లో సోనెట్ అందుబాటులో ఉంటుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈఓ కుక్హ్యున్ షిమ్ తెలిపారు. ఐదు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో సోనెట్ను తీసుకువచ్చినట్లు చెప్పారు.