కేసీఆర్‌ను కలిసిన దళపతి విజయ్‌

ABN , First Publish Date - 2022-05-19T08:48:51+05:30 IST

తమిళ మాస్‌ హీరో.. దళపతి విజయ్‌.. సీఎం కేసీఆర్‌ను బుధవారం ఆయన క్యాంప్‌ ఆఫీసులో కలిశారు. ఒక సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన విజయ్‌..

కేసీఆర్‌ను కలిసిన దళపతి విజయ్‌

  • ప్రగతిభవన్‌లో ప్రశాంత్‌కిశోర్‌తోనూ భేటీ
  • తెలుగు దర్శకుడితో కలిసి సీఎం వద్దకు
  • మర్యాదపూర్వక భేటీయేనన్న సీఎంవో


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): తమిళ మాస్‌ హీరో.. దళపతి విజయ్‌.. సీఎం కేసీఆర్‌ను బుధవారం ఆయన క్యాంప్‌ ఆఫీసులో కలిశారు. ఒక సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన విజయ్‌.. దర్శకుడు పైడిపల్లి వంశీ, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం వద్దకు వెళ్లారు. అక్కడ విజయ్‌కు కేసీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. సీఎంతో భేటీ అనంతరం.. ప్రగతి భవన్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ను కలిసిన విజయ్‌ ఆయనతో రెండు గంటలపాటు చర్చించినట్టు సమాచారం. ఈ ఏడాది మార్చిలో కూడా విజయ్‌ పీకేతో భేటీ అయినట్టు తెలుస్తోంది.


తమిళనాట భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విజయ్‌ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం చాలాకాలంగా కొనసాగుతోంది. ఆయన తండ్రి ఏఎస్‌ చంద్రశేఖర్‌ ‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీకూడా రిజిస్టర్‌ చేయించారు. కానీ, ఆ పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్‌ ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాట జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయ్‌ అభిమానులు పోటీచేసి 115 సీట్లు గెలుచుకోవడం విశేషం. కాగా, జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ ఎజెండా గురించి గత నెలలో జరిగిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విజయ్‌ రెండు నెలల వ్యవధిలోనే పీకేను రెండుసార్లు కలవడం, బుధవారం సీఎం కేసీఆర్‌తో భేటీ కావడం చర్చోపచర్చలకు దారితీస్తోంది. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయేనని పేర్కొంటోంది. కాగా.. అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంఘం(ఇష్టా) అధ్యక్షుడిగా ఎంపికైన డా.కేశవులు బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేశవులును కేసీఆర్‌ అభినందించారు. ఇక.. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ కూడా బుధవారం సీఎంను కలిసి తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Updated Date - 2022-05-19T08:48:51+05:30 IST