‘టెలిమెడిసిన్’పై ఆరాతీయండి
ABN , First Publish Date - 2020-08-08T08:36:45+05:30 IST
కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా టెలిమెడిసిన్ సేవలపై ఆరా తీయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం
- కొవిడ్-19 సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా టెలిమెడిసిన్ సేవలపై ఆరా తీయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కొవిడ్-19పై సమీక్షను నిర్వహించారు. కరోనా పరీక్షలు బాగా చేస్తున్నారని అధికారులను సీఎం ప్రశంసించారు. కట్టడి ప్రాంతాల వద్దే ఎక్కువగా టెస్టులు చేయడం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. 104, 14410 కాల్సెంటర్లు సమర్థంగా పని చేయాలని, వాటి పనితీరును ఎప్పటికప్పడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలు కాల్ చేసిన వెంటనే స్పందన రావాలన్నారు. కొవిడ్ ఆస్పత్రుల్లో భోజన, వసతి సదుపాయాలపై సీఎం ఆరాతీశారు. పాఠశాలలు తెరిచే సమయానికి విద్యార్ధులందరికీ మాస్క్లు సరఫరా చేయాలని ఆదేశించారు. కొవిడ్ అస్పత్రుల్లో సేవలపై ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు అతికించాలని జగన్ సూచించారు.
ఏపీలో కొవిడ్ నివారణ భేష్
రాష్ట్రంలో కొవిడ్ టెస్టింగ్లు, ట్రేసింగ్లు బాగున్నాయని బ్రిటిష్ తాత్కాలిక హైకమిషనర్ జాన్ థాంప్సన్, డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ప్రశంసించారు. సీఎం జగన్ వారితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మెడ్టెక్ జోన్తో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని జాన్ థాంప్సన్ చెప్పారు. నేషనల్ హెల్త్ మిషన్ భాగస్వామ్యంతో 108, 104 అంబులెన్స్ల నిర్వహణకు అవసరమైన ఉత్తమ సాంకేతికతను అందిస్తుందన్నారు.