నిబంధ‌న‌లు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

ABN , First Publish Date - 2022-01-10T00:42:42+05:30 IST

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్పమత్తంగా ఉంటే కరోనా ప్రమాదం వుంచి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచించారు.

నిబంధ‌న‌లు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్

హైద‌రాబాద్‌: కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్పమత్తంగా ఉంటే కరోనా ప్రమాదం వుంచి తప్పించుకోవచ్చని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచించారు. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, స్వీయ నియంత్రణ చర్యలను చేపట్టాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తతపై ప్రగతి భవన్ లో ఆదివారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల పురోగతి పై కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కోవిడ్ పట్ల భయాందోళనలు పడకుండా ఉండాలని, అశ్రద్ధ చేయకుండా మాస్కులు ధరించడం, సానిటైజేషన్ చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి స్వీయ నియంత్రణ చర్యలు తప్పనిసరిగా పాటించాలన్నారు.


ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ విధిగా వేయించుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాల వారికి వాక్సినేషన్ కార్యక్రమం నడుస్తున్నదని, తల్లిదండ్రులు అశ్రద్ద చేయకుండా తమ పిల్లలకు వాక్సిన్ వేయించాలన్నారు. సోమవారం నుంచి 60 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులకు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు (మూడో డోసు) బూస్టర్ డోసును ప్రారంభించనున్నామని తెలిపారు. అర్హులైన వారందరూ తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని సిఎం అన్నారు. వ్యాధి లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలోని ప్రభుత్వ దవాఖానాకు వెల్లి చికిత్స చేయించుకోవాలన్నారు. రాబోయే సంక్రాంతి నేపథ్యంలో గుంపులుగా కాకుండా ఎవరిండ్లల్లో వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని ప్రజలకు సీఎం సూచించారు.


రాష్ట్ర సచివాలయ భవన సముదాయం నిర్మాణ పనుల పురోగతి పై కూడా సీఎం కేసిఆర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన పనులతో పాటు, లాండ్ స్కేపింగ్, సచివాలయంలో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, తదితర అనుబంధ భవనాల నిర్మాణ పనుల వేగాన్ని కూడా సమాంతరంగా పెంచాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సీఎం సూచించారు. సచివాలయానికి పటిష్టమైన భధ్రతా చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో పోలీసు వారికి కావాల్సిన వసతులు తదితర అంశాల గురించి డీజీపీ మహేందర్ రెడ్డి తో సంప్రదించి చర్యలు చేపట్టాలన్నారు. 24 గంటల నిఘా కోసం అధునాతన సాంకేతికతతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 




కాగా రాష్ట్రంలో కొనసాగుతున్న నీటి ప్రాజెక్టులపై కూడా సీఎం కేసీఆర్ ఆరా తీశారు. గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్ ల అనుమతుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జల సంఘం వారు కోరుతున్న అన్ని వివరాలను , అదనపు సమాచారాన్ని సమర్పించి త్వరితగతిన అనుమతులు పొందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడం పట్ల సీఎం కేసిఆర్ అసహనం వ్యక్తం చేశారు. డా. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ ను త్వరితగతిన సిద్దం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 


ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్ిద వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణా రావు, రజత్ కుమార్ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ తో పాటు సిఎంవో అధికారులు స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ , ఇరిగేషన్ శాఖ అధికారులు ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మురళీధర్, హరి రామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, ఎస్ ఇ కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-10T00:42:42+05:30 IST