దసరా నాటికి రైతు వేదికలు

ABN , First Publish Date - 2020-07-12T07:50:04+05:30 IST

దసరా నాటికి రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి,

దసరా నాటికి రైతు వేదికలు

  • విత్తనాల నిల్వకు కోల్డ్‌ స్టోరేజీ.. రూ.25కోట్లతో ఏడాదిలోగా నిర్మాణం
  • నియంత్రిత సాగుకు రైతుల మద్దతు... ఇది వందశాతం విజయవంతం
  • దాదాపు అందరికీ రైతుబంధు: సీఎం కేసీఆర్‌.. వ్యవసాయంపై సమీక్ష
  • 2 వారాల తర్వాత ఫాంహౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు.. వదంతులకు తెర
  • వ్యవసాయశాఖపై  సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): దసరా నాటికి రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి దేశంలో మరెక్కడా లేని విధంగా  రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వేదికల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, దసరాలోగా వాటి నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలని సూచించారు. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలవుతాయని అన్నారు. ఇప్పటివరకు రైతుల్లో 99.9శాతం మందికి రైతుబంధు సాయం అందినట్లు సమాచారం ఉందని, ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే సాయం అందించాలని సూచించారు. రైతుబంధు సాయం అందించడానికి కాలపరిమితి లేదని, చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దని అధికారులకు సూచించారు.


రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని చెప్పే పరిస్థితి రావొద్దని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ ప్రగతిభవన్‌లో రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కష్టకాలంలో ఆర్థికపరిస్థితి అంత ఆశాజనకంగా లేకున్నా.. ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. అధికారులంతా ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు అందించారని చెప్పారు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.  కాగా కాస్తులో ఉన్నప్పటికీ కొంత మంది రైతులకు యాజమాన్య హక్కుల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉండటం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.


యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్‌ ఎంక్వయిరీ) నిర్వహించాలని సూచించారు. ‘‘రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలి. క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి, రైతుబంధు సమితుల ద్వారా వివరాలు తెప్పించాలి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఆ వివరాలనూ వెంటనే నమోదు చేయాలి’’ అని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.


రూ.25కోట్లతో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం

తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందని, అందులో భాగంగా భారీగా విత్తనోత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక కోల్డ్‌ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి కావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల అవుతాయన్నారు. ఏడాదిలోగా దాని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. 


మేడ్చల్‌ జిల్లా లక్ష్మాపూర్‌ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల గ్రామంలో సర్వే జరిపారని కేసీఆర్‌ అన్నారు. భూమికి ఎవరు యజమానో నిర్ధారించారని, మిగతా చోట్లా అదే జరగాలని సూచించారు.


మంచి ధర రావడమే నియంత్రిత సాగు లక్ష్యం!

రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడమే లక్ష్యంగా నియంత్రిత సాగు పద్థతిని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారని, మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదని చెప్పారు. ఇది గొప్ప పరివర్తన అని, నియంత్రిత సాగు పద్థతి వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. రైతుల్లోని ఐక్యత, చైతన్యం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప విజయాలకు నాంది పలికిందని, ఇది ఎంతో శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. రైతులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2020-07-12T07:50:04+05:30 IST