ఏపీవి గొంతెమ్మ కోరికలు: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2022-01-04T14:52:56+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనవసర వివాదాలు సృష్టిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనవసర వివాదాలు సృష్టిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. విభజన చట్టానికి వ్యతిరేకంగా సింగరేణి సంస్థల్లో వాటా కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని అధికారులకు సూచించారు.
ఈనెల 12న హోంశాఖకార్యదర్శి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల సీఎస్ల భేటీ జరగనుంది. ఈ సమావేశంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు, ఆదేశాలతో దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర పునర్ విభజన చట్టానికి తెలంగాణ నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని సమావేశంలో స్పష్టం చేయాలని సీఎం సీఎస్కు సూచించారు. విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంటేనే తాము సహకరించాలని లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు.