రైతులకు మళ్లీ చెబుతున్నా.. మక్కలు వేయొద్దు : కేసీఆర్
ABN , First Publish Date - 2020-10-31T20:18:49+05:30 IST
తెలంగాణ రైతన్నలు మక్క పంట వేయొద్దని ఇదివరకే పలుమార్లు చెప్పిన
జనగామ : తెలంగాణ రైతన్నలు మక్క పంట వేయొద్దని ఇదివరకే పలుమార్లు చెప్పిన సీఎం కేసీఆర్.. జనగామ వేదికగా మరోసారి ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఇవాళ కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈసారికి ప్రభుత్వానికి నష్టమైనా మక్కలు కొన్నామని తెలిపారు. ఇక ముందు మక్కలు వేయొద్దు.. పంట వేసినా దాన్ని ప్రభుత్వం కొనదు అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మార్కెట్ ఉండే పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని.. ఇది తన కల అని ఆయన చెప్పుకొచ్చారు.
మోదీకి చెప్పా..!
అమెరికా, యూరప్లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ లేదన్నారు. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయన్నారు. ‘తెలంగాణలో రైతు రాజ్యం వచ్చి తీరుతుంది. కరోనా కాలంలో వ్యవసాయం ఆగొద్దని ప్రధాని మోదీకి చెప్పాను. సమైక్యరాష్ట్రంలో రైతుల్ని ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. 75శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశాం. కరోనా కారణంగా రాష్ట్రం రూ.50 వేల కోట్లు నష్టపోయింది. ప్రతిపక్షాలకు ఓటు తప్ప ఇంకేం కనిపించడం లేదు’ అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.