లాక్‌డౌన్‌తో చేటే

ABN , First Publish Date - 2021-04-28T08:55:24+05:30 IST

లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికీ, సామాన్యప్రజలకూ తీవ్ర ఆర్థికనష్టం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘లాక్‌డౌన్‌వల్ల ప్రభుత్వానికి రూపాయి నష్టం కలిగితే,సామాన్యుడు నాలుగు రూపాయలు

లాక్‌డౌన్‌తో చేటే

సర్కారు రూపాయి నష్టపోతే

సామాన్యుడు 4 కోల్పోతాడు

ఆర్థిక కార్యక్రమాలు ఆగరాదు

వేగంగా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

అప్రమత్తంగా ఉండండి

స్పందనలో కలెక్టర్లు, ఎస్పీలకు 

సీఎం జగన్‌ ఆదేశాలు


అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికీ, సామాన్యప్రజలకూ తీవ్ర ఆర్థికనష్టం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘లాక్‌డౌన్‌వల్ల ప్రభుత్వానికి రూపాయి నష్టం కలిగితే,సామాన్యుడు నాలుగు రూపాయలు కోల్పోతాడు. గతేడాది ప్రభుత్వానికి దాదాపు రూ.20,000కోట్లనష్టం వాటిల్లింది. అంటే .. సామాన్యులు దాదాపు రూ.80,000 కోట్లు నష్టపోయినట్టే’’నని ఆయన వ్యాఖ్యానించారు. కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వచ్చే కొన్నినెలలపాటు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం  కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ స్పందన కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్‌, ఉపాధిహామీ పనులకింద లేబర్‌బడ్జెట్‌, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లినిక్కులు, ఏఎంసీయూ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలు, వైఎ్‌సఆర్‌ అర్బన్‌ క్లినిక్కులు, 90 రోజుల్లో ఇంటిస్థలం కేటాయింపు, స్పందన కార్యక్రమం సమస్యల పరిష్కారం వంటి అంశాలు సహా.... ఏప్రిల్‌ , మే నెలల్లో అమలు చేయనున్న పథకాలపై సీఎం సమీక్షించారు. కరోనా నియంత్రణలోభాగంగా ఏడుకోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తిజరుగుతోందని, అందులో కొవాగ్జిన్‌ కోటి డోసులు కాగా .. మిగతావి కొవిషీల్డ్‌ ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు.  


రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడ్డవారిలో ఇప్పటివరకూ 11.30 లక్షలమందికి రెండు డోసు, దాదాపు 45.48 లక్షలమందికి తొలి డోసు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. కొవిడ్‌ నియంత్రణలోభాగంగా అందరూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని.. ఇవి మాత్రమే నివారణ మార్గాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. 104 కాల్‌ సెంటర్‌ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. 104 నంబరుకు ఫోన్‌చేసేవారికి తక్షణమే పరిష్కారం చూపాలనీ, ఆస్పత్రికి వెళ్లడమా? హోం క్వారంటైన్‌కు పంపడమా?  హోం ఐసొలేషన్‌లో ఉంచడమా అనే అంశాలపై స్పష్టతను ఇవ్వాలని చెప్పారు.  104 కాల్‌ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలనీ, దానిని వన్‌ సెంటర్‌ సొల్యూషన్‌గా మలచాలని కోరారు. 


జేసీలదే బాధ్యత..

కరోనానియంత్రణ బాధ్యత జాయింట్‌ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్సను సమీక్షించాలని, కొవిడ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 59 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, రోజూ 320-340 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోందని అధికారులు తెలపగా, అవసరమైనవారందరికీ ఆక్సిజన్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఆర్థిక కార్యక్రమాలు ఆగరాదన్నారు.  కొవిడ్‌పై వదంతులు సృష్టించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అరెస్టులు చేయాలని ఆదేశించారు.

Updated Date - 2021-04-28T08:55:24+05:30 IST