నన్ను 'అన్ఫాలో' చేయండి.. బైడెన్ను కోరిన ప్రముఖ నటి
ABN , First Publish Date - 2021-02-25T02:07:40+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతా @POTUS ద్వారా కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారిక ట్విటర్ ఖాతా @POTUS ద్వారా కేవలం 13 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. వీరిలో ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, ఇతర శ్వేతసౌధం సిబ్బందితో పాటు ఓ నటి కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు. అమెరికన్ టెలివిజన్ స్టార్, రచయిత, మోడల్ అయిన క్రిస్సీ టైగెన్. క్రిస్సీ అభ్యర్థన మేరకే బైడెన్ ఆమెను ఫాలో చేశారు. అయితే, తాజాగా క్రిస్సీ తనను అన్ఫాలో చేయాల్సిందిగా అధ్యక్షుడిని కోరింది. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేసింది.
"విలువైన @POTUS నుండి నేను కొన్ని సార్లు ట్వీట్ చేశాను. కానీ, నాకు నాలా గుర్తింపు దక్కాలంటే మీరు నన్ను అనుసరించవద్దు అని నేను మిమ్మల్ని అడగాలి. ఐ లవ్యూ యూ!!! ఇది మీరు కాదు ఇది నేను !!!!" అని ఇలా ఆమె తన ట్వీట్లో అర్థంకాని విధంగా ఏదో రాసుకొచ్చారు. ఇందులో ఒక్కటి మాత్రం క్లీయర్గా ఉంది. అదేంటంటే తనను అన్ఫాలో కావాలని కోరడం. ఇది చూసిన @POTUS క్రిస్సీని వెంటనే అన్ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం @POTUS ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 నుంచి 12కు పడిపోయింది.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే క్రిస్సీ.. గతంలో ట్విటర్ వేదికగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై పలుమార్లు విమర్శలు చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన ట్రంప్.. ఆమెను @POTUS ఖాతాలో బ్లాక్ చేశారు. అయితే, ఇటీవల ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవడం.. కొత్తగా బైడెన్ బాధ్యతలు చేపట్టడంతో క్రిస్సీ తనను ఫాలో కావాల్సిందిగా ఓ ట్వీట్ చేశారు. 'నాలుగేళ్లుగా @POTUS అకౌంట్లో నన్ను బ్లాక్ చేశారు. ప్లీజ్.. మీరు ఫాలో అవ్వగలరు' అని రిక్వెస్ట్ చేశారు. ఆమె అభ్యర్థనను బైడెన్ మన్నించడంతో పోటస్ అధికారిక ఖాతా ఫాలో అవుతున్న వారిలో క్రిస్సీ కూడా చేరారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మళ్లీ ఇప్పుడు తనంతట తానే తనను అన్ఫాలో కావాలని కోరడం గమనార్హం.