చివరి ఐపీఎల్‌ అన్నాడు.. మనసు మార్చుకున్నాడు

ABN , First Publish Date - 2022-05-15T09:47:20+05:30 IST

ఇదే తన చివరి ఐపీఎల్‌ అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు క్రికెట్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు.

చివరి ఐపీఎల్‌ అన్నాడు..  మనసు మార్చుకున్నాడు

రాయుడు ట్వీట్‌తో గందరగోళం

ముంబై: ఇదే తన చివరి ఐపీఎల్‌ అంటూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్‌ అంబటి రాయుడు క్రికెట్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. అంతలోనే ఏమైందో.. ఏమో కాసేపట్లోనే మనసు మార్చుకొని వారిని అయోమయానికి గురి చేశాడు. తాజా సీజన్‌లో రాయుడు పెద్దగా రాణించని విషయం తెలిసిందే. ‘ఇదే నా చివరి ఐపీఎల్‌ అని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది. 13 ఏళ్లుగా ముంబై, చెన్నై తరఫున నా ప్రయాణం అద్భుతంగా సాగింది.


అందుకే ఆ రెండు జట్లకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని శనివారం మధ్యాహ్నం ట్వీట్‌ చేశాడు. ఆ వెంటనే ఇది వైరల్‌కాగా కొన్ని నిమిషాల్లోనే ఆ ట్వీట్‌ను రాయుడు తొలగించాడు. మరోవైపు రాయుడు రిటైర్‌ కావడం లేదని జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్‌ స్పష్టం చేశాడు. ‘ఈ సీజన్‌లో సరిగ్గా రాణించనందుకు రాయుడు అసంతృప్తితో ఉన్నాడు. ఆ నిస్పృహతోనే అలా ట్వీట్‌ చేశాడు. అయితే వెంటనే అతడితో మాట్లాడా. మేనేజ్‌మెంట్‌ నీ ప్రదర్శనపై సంతృప్తిగానే ఉందని, రిటైర్‌ కావాల్సిన అవసరం లేదని చెప్పా. దీనికి అతడు అంగీకరించాడు’ అని విశ్వనాథ్‌ వివరించాడు. 

Updated Date - 2022-05-15T09:47:20+05:30 IST