ఏపీలో క్వారంటైన్ విధానంలో మార్పులు

ABN , First Publish Date - 2020-07-14T02:26:45+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీలో క్వారంటైన్ విధానంలో మార్పులు

అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్ విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కోవిడ్-19 అధిక ప్రభావిత ప్రాంతాలుగా వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ రెండు రాష్ట్రాలను తక్కువ ప్రభావిత ప్రాంతాలుగా ప్రభుత్వం నిర్ధారించింది. ప్రస్తుతం కేసుల సంఖ్య తీవ్రస్థాయికి చేరటంతో ఈ రెండు రాష్ట్రాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించింది. విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి విధించే 7 రోజుల క్వారంటైన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. గల్ఫ్ నుంచి వచ్చిన వారికి 14 రోజుల క్వారంటైన్‌ను 7 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఏపీకి తిరిగివచ్చి క్వారంటైన్‌లో ఉన్న వారికి 5వ రోజు, 7వరోజున కోవిడ్ టెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది.


దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమాన ప్రయాణికుల్లో 10 శాతం మందిని గుర్తించి ర్యాండమ్‌గా కరోనా టెస్టులు చేయాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. విమానాశ్రయాల్లోనే టెస్టులు చేయాల్సిందిగా సూచించింది. రైళ్ల ద్వారా ఏపీకీ వచ్చే వారిలోనూ ర్యాండమ్‌గా టెస్టులు చేయాలని, 14 రోజుల హోమ్ క్వారంటైన్ తప్పనిసరి చేయాల్సిందిగా ఆదేశించింది. రహదారి మార్గం ద్వారా ఏపీలోకి ప్రవేశించే చోట బోర్డర్ చెక్‌పోస్టుల వద్దే టెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం చెప్పింది. ఏపీకి వచ్చేందుకు స్పందన యాప్ ద్వారా ఇ-పాస్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను తక్షణం వేరు చేసి వారిని కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచించింది. హోమ్ క్వారంటైన్ చేసిన వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఏఎన్ఎంలు, గ్రామవార్డు వాలంటీర్, సచివాలయ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-07-14T02:26:45+05:30 IST