వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-01T23:20:57+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే రాధా నివాసానికి శనివారం వెళ్లారు. చంద్రబాబుకు స్వాగతం పలికి రాధా లోపలికి తీసుకువెళ్లారు.

వంగవీటి రాధా ఇంటికి వెళ్లిన చంద్రబాబు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా నివాసానికి శనివారం వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదర స్వాగతం పలికారు. ఇటీవల రాధాను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. రెక్కీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ, తాను అండగా ఉంటామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాధా భద్రతపై ఆయన ఆరా తీశారు. రాధా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా వెల్లడించి.. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. రాధా ప్రకటన తర్వాత ఆయనకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రెక్కీ ఎవరు నిర్వహించారు?.. ఎందుకు రాధాను హత్య చేయాలనుకుంటున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంగవీటి హత్యకు రెక్కీ నిర్వహించిన ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా ఆయన డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ కూడా రాశారు.

Updated Date - 2022-01-01T23:20:57+05:30 IST