నేడు ఒంగోలుకు చంద్రబాబు

ABN , First Publish Date - 2022-05-26T12:54:13+05:30 IST

నేడు ఒంగోలుకు చంద్రబాబు

నేడు ఒంగోలుకు చంద్రబాబు

ఒంగోలు,(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఒంగోలుకు వస్తున్నారు. మహానాడు మొదలయ్యే శుక్రవారంనాడు ఉదయానికి ఆయన వస్తారని అంతా భావించారు. అయితే.. తొలుత అనుకున్న షెడ్యూల్‌కు భిన్నంగా ఒకరోజు ముందే ఆయన ఒంగోలుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా సరిహద్దు అయిన మార్టూరు ప్రాంతం నుంచి ఒంగోలు వరకు గురువారం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు పొలిట్‌బ్యూరో సమావేశానికి చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. మహానాడులో చర్చించే కీలక అంశాలపై పొలిట్‌బ్యూరోలో చర్చించనున్నట్లు సమాచారం. మహానాడు జరిగే రెండురోజులూ ఇతర ముఖ్యనేతలతో కలిసి ఆ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. కాగా, ఒంగోలులో మహానాడు ప్రాంగణం అయిన మండవవారిపాలెం పొలాల్లో వారంరోజులకుపైగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు మహానాడు ఏర్పాట్లు ఒక కొలిక్కి రాగా, ఒంగోలు నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులతోపాటు పాత బైపాస్‌ రోడ్డు ప్రాంతాలు టీడీపీ తోరణాలతో, జెండాలు, నేతల ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లతో నిండిపోయాయి. మహానాడు ప్రాంగణంలో ప్రతినిధుల సభ, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తుండగా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం సాయంత్రం ఒంగోలు చేరుకున్నారు. రాష్ట్ర, జిల్లా నేతలతో కలిసి మహానాడు ప్రాంగణాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

Updated Date - 2022-05-26T12:54:13+05:30 IST