Chandrababu ఇంటికోసం భూమి రిజిస్ట్రేషన్ పూర్తి
ABN , First Publish Date - 2022-06-05T02:14:38+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓ ఇంటిని నిర్మించుకోనున్నారు.
కుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓ ఇంటిని నిర్మించుకోనున్నారు. దీనికి అవసరమైన భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నాడు పూర్తైంది. శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని ఆయన సుబ్బమ్మ అనే వృద్ధురాలి నుంచి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకంటూ సొంత ఇల్లు కుప్పం నియోజకవర్గంలో లేకపోవడం విమర్శలు చేయడానికి విపక్షాలకు అవకాశమిచ్చింది. దీంతో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు. చంద్రబాబు గత నెలలో నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు ఈ స్థలాన్ని పరిశీలించారు. భూమి రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకం కూడా చేసేశారు. ఆయన ప్రతినిధిగా చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ రిజిస్ట్రేషన్ పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ విజయకుమార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి, విక్రయదారులనుంచి మనోహర్కు భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెలాఖరులోగా ఇక్కడ ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.