కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశా: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-03-31T23:19:10+05:30 IST
ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. టెస్ట్లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని...
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు సరిగా చేయడంలేదని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. టెస్ట్లు చేయకపోవడం వల్ల కరోనా వ్యాప్తి పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. లోకల్ ట్రాన్స్మిషన్ను కంట్రోల్ చేయకపోతే కష్టమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు 9 లేఖలు రాశామని చెప్పారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోందన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఆర్థిక రంగం తీవ్రంగా దెబ్బతిందని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధ్యత నిర్వర్తించమని అడిగితే ప్రభుత్వాన్ని అడిగితే ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు రూ.5 వేలు ఇవ్వాలని కోరామని చెప్పారు. మాస్క్లు, శానిటైజర్లు అందించలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షా కేంద్రాలు తక్కువగా ఉన్నాయన్నారు. కరోనా కంటే మనలోని భయమే ప్రమాదకరమని చెప్పారు. ప్రభుత్వం కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.
చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ ‘‘ప్రధాని పిలుపుమేరకు భౌతికదూరం పాటించాలి. లాక్డౌన్పై ప్రజలకు అవగాహన కల్పించాలి. అన్ని దేశాలను కరోనా ఇబ్బంది పెడుతోంది. ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. స్వీయ నియంత్రణ వల్లే కరోనాను కట్టడి చేయొచ్చు. కరోనా వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేశాం. ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వేడినీళ్లతో ఆవిరి పట్టుకోవాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇంట్లో వండుకున్న ఆహారాన్నే తినాలి. రాత్రి 8 గంటలలోపే తినాలి. సి విటమిన్ ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవాలి. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలి. చైనా, అమెరికా, సింగపూర్ వంటి పెద్ద దేశాలే కరోనాను కట్టడి చేయలేకపోయాయి. చైనాలోని వూహాన్లో 62 రోజులు లాక్డౌన్ పాటించారు.’’ అని చెప్పారు.