నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-01-04T19:30:19+05:30 IST

వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలోనే ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు.

నా రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ పాలనతో ప్రజలంతా నష్టపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలోనే ఇలాంటి పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. నేడు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. జరగబోయే నష్టాన్ని ప్రజలంతా గమనించాలన్నారు. రాష్ట్రంలో విధ్వంసంతో పరిపాలన ప్రారంభించారని.. ప్రజల కోసం కట్టిన ప్రజావేదికను కూల్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇంకా ఆయన మాట్లాడతూ.. ‘‘ రాజధాని కోసం 50 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారు. రాజధానిలో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వాలు ఇలాగే విధ్వంసం చేస్తే హైదరాబాద్‌ ఉండేదా? ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి మాట తప్పారు. కోట్ల ఆస్తిని విధ్వంసం చేస్తున్నప్పుడు ప్రజా చైతన్యం అవసరం. అమరావతి, పోలవరం అభివృద్ధి చెందితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. పోలవరం డీపీఆర్‌ను ఎందుకు ఖరారు చేయలేకపోయారు? పోలవరం పూర్తి  చేయడం మీకు చేతనవుతుందా? పోలవరంపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా? ప్రాజెక్టులు తేవడం విధ్వంసం చేసినంత సులువు కాదు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ చేశాం. ఆ పెట్టుబడులు వస్తే 30 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-04T19:30:19+05:30 IST