హత్యను ఒప్పుకోమని చిత్రహింసలు పెట్టారు
ABN , First Publish Date - 2021-08-10T09:36:59+05:30 IST
‘‘వివేకానందరెడ్డిని మీరే హత్య చేశారు. ఒప్పుకోండి’’ అంటూ సీబీఐ అధికారులు తమ కుమారుడు సునీల్ యాదవ్ను, తమను చిత్రహింసలు పెట్టారని ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్యాదవ్...
- సీబీఐపై సునీల్ యాదవ్ తల్లిదండ్రుల ఆరోపణ
పులివెందుల, ఆగస్టు 9: ‘‘వివేకానందరెడ్డిని మీరే హత్య చేశారు. ఒప్పుకోండి’’ అంటూ సీబీఐ అధికారులు తమ కుమారుడు సునీల్ యాదవ్ను, తమను చిత్రహింసలు పెట్టారని ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్యాదవ్ తల్లిదండ్రులు సావిత్రమ్మ, కృష్ణయ్య యాదవ్లు చెప్పారు. సోమవారం వారి నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. రెండు నెలలుగా సునీల్ యాదవ్ను, తమ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బట్టలు ఊడదీసి ఇష్టమొచ్చినట్లు చితకబాదారని కృష్ణయ్యయాదవ్ చెప్పారు. ‘‘ఒప్పుకొంటే మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది. లేదంటే ఇబ్బంది పడుతుంది’’ అని సీబీఐ అధికారులు పదేపదే హెచ్చరించారన్నారు. ఈ కేసుతో సునీల్కు కానీ, తమకు గాని ఎలాంటి సంబంఽధం లేదన్నారు. కావాలనే తమను ఇరికిస్తున్నారన్నారు. సావిత్రమ్మ మాట్లాడుతూ.. తనను ఎన్నో ప్రశ్నలు అడిగారని అవి చెప్పుకోలేనివని అన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నోరు తెరవని రంగయ్య ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు? మా అబ్బాయి సునీల్ తప్పు చేసేవాడు కాదు. ఈ కేసులో మా అబ్బాయిని ఇరికించేందుకే ప్రయత్నం సాగుతోంది అని సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సునీల్ యాదవ్ భార్య లక్ష్మి మాట్లాడుతూ... సీబీఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా తన భర్తను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు.