37మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై కేసు, 14 రోజుల రిమాండ్
ABN , First Publish Date - 2020-08-13T15:43:02+05:30 IST
నిన్న ప్రగతి భవన్ ముట్టడించిన 37మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్: నిన్న ప్రగతి భవన్ ముట్టడించిన 37మంది ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని చంచల్ గూడ జైల్కు తరలించారు.
పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడాన్ని నిరసిస్తూ ఎన్ఎస్యూఐ నాయకులు ప్రగతి భవన్ను ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం పీపీఈ కిట్లు ధరించి ఓ డీసీఎంలో అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘం నేతలు, కార్యకర్తలు... ఒక్క సారిగా ఆందోళన చేపట్టారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఓ విద్యార్థి ఇనుప గ్రిల్స్ ఎక్కి లోపలకు దిగాడు. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మిగతా నాయకులందరూ అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. వారందరినీ లాగి పడేశారు. వ్యాన్లో ఎక్కించి గోషామహల్ పీఎస్కు తరలించారు. రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.