రాజధాని భవనాలు లీజుకు
ABN , First Publish Date - 2022-06-27T08:17:41+05:30 IST
రాజధాని భవనాలు లీజుకు
ఉద్యోగుల కోసం నిర్మించిన బిల్డింగులపై సీఆర్డీఏ దృష్టి..
రూ.813.56 కోట్లతో టీడీపీ హయాంలో 66ు పూర్తి
వాటినే ఆదాయంగా మార్చుకునే వ్యూహం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
అమరావతిలో రాజధాని భూములను అమ్మకానికి పెడుతున్న సీఆర్డీఏ తాజాగా ఉద్యోగుల కోసం నిర్మించిన గ్రూప్-డీ భవనాలను లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను వె లువరించనుంది. ఇటీవలే గ్రూప్-డీ భవనాలను లీజుకు ఇవ్వటానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ టైప్-1 , టైప్- 2 భవనాలతో కలిపి నాలుగో తరగతి ఉద్యోగుల కోసం గ్రూప్-డీ భవనాలను గత టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. తొలి దశలో రూ.813.56 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టింది. జీ-ప్లస్ 12 విధానంలో ఈ భవనాల నిర్మాణ పనులను ఎస్పీసీఎల్ సంస్థ చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలోనే 66 శాతం మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం గ్రూప్-డీ భవనాలలో 10 వరకు బహుళ అంతస్థుల భవనాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. కేవలం ఫినిషింగ్ పనులు మాత్రమే చేయాల్సి ఉంది. ఈ భవనాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని సీఆర్డీఏ నిర్ణయించింది. వ్యాపార అవసరాల కోసం ప్రైవేటు సంస్థలకు ఈ భవనాలను కట్టబెట్టనున్నారు. లీజుకు సంబంధించి సోమ, మంగళవారాలలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎక్కువ ధర కోట్ చేసిన సంస్థలకు వీటిని ఇవ్వనున్నట్టు సీఆర్డీఏ వర్గాలు తెలిపాయి.