ఐపీఓ మార్కెట్లో మళ్లీ సందడి
ABN , First Publish Date - 2020-09-17T06:17:17+05:30 IST
ఐపీఓ మార్కెట్లో మళ్లీ సందడి
న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్లో మళ్లీ సందడి కనిపిస్తోంది. గత వారం మార్కెట్కు వచ్చిన హ్యాపీయెస్ట్ మైండ్స్ సూపర్ డూపర్ హిట్టయింది. ఈ ఇష్యూ గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా 151 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబ్ అయింది. గత వారమే మార్కెట్కు వచ్చిన ‘రూట్ మొబైల్’ ఐపీఓ కూడా 73 రెట్లు ఓవర్ సబ్స్ర్కైబ్ అయింది. ఈక్విటీ మార్కెట్ ఎంత అనిశ్చితంగా ఉన్నా, మంచి వ్యాపార రంగంలో ఉన్న కంపెనీల ఐపీఓలకు ఢోకా లేదనేందుకు ఈ రెండు ఐపీఓలే ఉదాహరణ.
ఈ ఐపీఓల విజయంతో మరిన్ని కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న గ్లాండ్ ఫార్మా ఐపీఓ త్వరలోనే ఉంటుందని భావిస్తున్నారు. కల్యాణ్ జువెలర్స్ కూడా నిధుల సమీకరణ కోసం త్వరలో ఐపీఓ మార్కెట్కు రానుంది.
క్యామ్స్ ఐపీఓ ధర రూ.1,229-1,230 : కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) ఐపీఓ ధరల శ్రేణిని ప్రకటించింది. ఒక్కో షేరు ధరను రూ.1,229-1,230గా నిర్ణయించినట్టు పేర్కొంది. రూ.2,242 కోట్ల నిధుల సమీకరణ కోసం కంపెనీ ఐపీఓకు వస్తోంది. ఈ నెల 21న ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 23న ముగుస్తుంది.