బండి సంజయ్‌ది అజ్ఞానం, మూర్ఖత్వం

ABN , First Publish Date - 2022-05-02T10:19:15+05:30 IST

‘‘దేశంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర సర్కారు ఏం చేసింది? గతంలో నేతన్నలకు ఉన్న బీమాను కేంద్రం ఎత్తేస్తే..

బండి సంజయ్‌ది అజ్ఞానం, మూర్ఖత్వం

  • నేతన్నల సంక్షేమానికి కేంద్రమేం చేసింది?
  • బీమా ఎత్తేస్తే.. మేం కల్పిస్తున్నాం 
  • బడ్జెట్‌లో వందల కోట్లు కేటాయించాం
  • విమర్శలు కాదు.. టెక్స్‌టైల్‌ పార్కును 
  • సాధించండి: సంజయ్‌కు కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోని చేనేత కార్మికుల సంక్షేమానికి కేంద్ర సర్కారు ఏం చేసింది? గతంలో నేతన్నలకు ఉన్న బీమాను కేంద్రం ఎత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సౌకర్యం కల్పిస్తోంది’’ అని రాష్ట్ర చేనేత, జౌళి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని చాటేలా ఉన్నాయన్నారు. నేతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, వారికోసం కేంద్రం ఏం చేసిందో బండి సంజయ్‌ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అద్భుత కార్యక్రమాలు చేపడుతూ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు.


దేశంలోనే అతిపెద్దదైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు కేంద్రం నుంచి అందిన సాయంపై సంజయ్‌ సమాధానం చెప్పాలని, నేతన్నలపై నిజమైన ప్రేమ ఉంటే పార్లమెంటులో ప్రత్యేక సాయం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. నేతన్నల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.వందల కోట్లు ఒకేసారి బడ్జెట్లో కేటాయించిందని, రుణాలను మాఫీ చేసి చేనేత వృత్తిదారులను అప్పుల ఊబి నుంచి కాపాడిందీ తామేనని పేర్కొన్నారు. నేతన్నకు చేయూత పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పొదుపు పథకం కొవిడ్‌ సమయంలో వారికి ఆపన్నహస్తంగా మారిందని, మగ్గాల ఆధునికీకరణ నుంచి వర్కర్‌ టూ ఓనర్‌ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని నేతన్నల ఆదాయం రెట్టింపయిందన్నారు. గతంలో నేతన్నల శవాల సాక్షిగా వివిధ పార్టీలు రాజకీయాలు చేశాయని, ఆ పరిస్థితిని తెలంగాణలో తిరిగి తెచ్చేందుకు బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.  


కేంద్రం సహాయ నిరాకరణ

నేతన్నల సంక్షేమం, అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేంద్రం సంపూర్ణ సహాయ నిరాకరణ చేస్తోందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని సహా, కేంద్ర మంత్రులను కలిసి కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌కు సాయం అందించాలన్న తమ విజ్ఞప్తిని పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలో నేషనల్‌ టెక్స్‌టైల్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు, చేనేతల కోసం ఒక ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ, మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను సైతం కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ చేసేది కపట పాదయాత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నేతన్నల కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని మాట్లాడుతున్న సంజయ్‌.. వాళ్ల పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉన్న విషయాన్ని మర్చిపోయి అవకాశవాదంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీగా ఉన్న ఆయన పార్లమెంటులో నేతన్నల సంక్షేమం కోసం ఒక్క మాటైనా మాట్లాడారా?, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తే.. ఏనాడైనా నోరు విప్పారా? అని నిలదీశారు. 


కేంద్రం అసమర్థ నిర్ణయాల వల్లే..

ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అత్యధికంగా పత్తి పండిస్తున్నప్పటికీ.. టెక్స్‌టైల్‌ ఉత్పత్తుల విషయంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక వంటి చిన్న దేశాల కన్నా వెనుకబడిపోయామని, ఇందుకు కేంద్రం అసమర్థ నిర్ణయాలే కారణమని కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగం తర్వాత అత్యధిక మందికి ఉపాధినిచ్చే టెక్స్‌టైల్స్‌ ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ విధించడంతో చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. చేనేత రంగంపై జీరో జీఎస్టీ చేయాలని ఎన్నిసార్లు లేఖలు రాసినా కేంద్రం స్పందించడం లేదని, దేశవ్యాప్తంగా నేతన్నలు ధర్నాలు, బంద్‌లు నిర్వహించినా పన్ను తగ్గించకపోగా కనీసం కనికరం చూపలేదని పేర్కొన్నారు. ఇక్కడ విమర్శలు చేయడం కాదు.. ధైర్యం ఉంటే ఢిల్లీలో ప్రధాని మోదీని నిలదీసి.. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక టెక్స్‌టైల్‌ పార్కును సాధించాలన్నారు. మీడియా కవరేజ్‌ కోసం అసత్యాలతో మోసం చేయాలని చూస్తే రాష్ట్రంలోని నేతన్నలు బీజేపీ నేతలకు బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-05-02T10:19:15+05:30 IST