కరోనాతో బ్రిటన్లో నర్సు మృతి
ABN , First Publish Date - 2020-04-05T08:34:56+05:30 IST
కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తూ 36 ఏళ్ల నర్సు అరీమా నస్రీన్ కూడా ఆ మ
- ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటా
- అంతిమ ఘడియల్లో చెవిలో చెప్పిన భర్త
లండన్, ఏప్రిల్ 4: కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తూ 36 ఏళ్ల నర్సు అరీమా నస్రీన్ కూడా ఆ మహమ్మారి బారిన పడింది. చివరిఘడియల్లో ఉన్న ఆమె.. తన ముగ్గురు పిల్లల గురించి బెంగ పెట్టుకుందని ఆ భర్త గుర్తించాడో ఏమో, వెంటిలేటర్ మీద ఉన్న ఆమె వద్దకు వెళ్లి ‘బెంగ పెట్టుకోకు.. పిల్లలను జాగ్రత్తగా చూసుకుటాను’ అని ఏడుస్తూనే చెవిలో చెప్పాడు. డాక్టర్లు వద్దన్నా వినకుండా ఆమెను చివరిసారిగా ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కొద్దిసేపటికే ఆమె తుదిశ్వాస విడిచింది. బ్రిటన్లోని వెస్ట్ మిడ్లాండ్స్ కౌంటీలోని వాల్సల్ మానర్ ఆస్పత్రిలో శనివారం ఈ విషాదం జరిగింది. ఆమె అదే ఆస్పత్రిలో పనిచేస్తోంది. నర్సుగా ఆమెకు 16ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమెకు భర్త, 8.. 10.. 17 ఏళ్ల వయస్సున ముగ్గురు పిల్లలున్నారు. ఆమె మృతితో అంతా శూన్యంగా అనిపిస్తోందని సోదరి ఆశా కన్నీటిపర్యంతమైంది. ఈ పరిస్థితి ఎవ్వరికీ రావొద్దని.. కరోనా వైరస్ లాక్డౌన్ను కచ్చితంగా పాటించాలని ప్రజలను మృతురాలి కుటుంబసభ్యులు వేడుకున్నారు.