నేడు బ్రాహ్మణ సమన్వయ సమ్మేళన సమావేశం

ABN , First Publish Date - 2021-03-07T11:49:54+05:30 IST

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో..

నేడు బ్రాహ్మణ సమన్వయ సమ్మేళన సమావేశం

హైదరాబాద్/కవాడిగూడ: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవికి మద్దతుగా ఆదివారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని పింగళి వెంకట్రామిరెడ్డి హాలులో బ్రాహ్మణ సమన్వయ సమ్మేళన సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవాసమాఖ్య జంటనగరాల అధ్యక్షుడు తులి శ్రీనివాస్‌, రీజినల్‌ కార్యదర్శి ఇ. ఒక్కలంక శ్రీనివాసరావు తెలిపారు.  ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే బ్రాహ్మణ సమన్వయ సమ్మేళన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. 


సమావేశానికి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షులు,  ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి అధ్యక్షత వహించనున్నారని, ఈ సమవేశంలో గౌరవ అతిథులుగా రాజ్యసభ సభ్యులు కెప్టెన్‌ వి. లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌, ఎమ్మెల్యే ముఠాగోపాల్‌, ఢిల్లీ తెలంగాణ ప్రతినిధి ఎస్‌. వేణుగోపాలాచారి, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవిప్రసాద్‌ హాజరు కానున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ సంఘాల సమాఖ్య నేతలు, ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 

Updated Date - 2021-03-07T11:49:54+05:30 IST