ఎస్కే జోషి పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
ABN , First Publish Date - 2020-07-11T08:46:52+05:30 IST
తెలంగాణ మాజీ సీఎస్ ఎస్కే జోషి రాసిన ‘‘ఎకో టీ కాలింగ్- టూవర్డ్స్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్’’ పుస్తకాన్ని ..
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మాజీ సీఎస్ ఎస్కే జోషి రాసిన ‘‘ఎకో టీ కాలింగ్- టూవర్డ్స్ పీపుల్ సెంట్రిక్ గవర్నెన్స్’’ పుస్తకాన్ని మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. ప్రభుత్వ అధికారిగా పని చేసిన సుధీర్ఘ అనుభవంతో, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని జోషి పేర్కొన్నారు. ప్రజలు, వారి అవసరాలే కేంద్రంగా తెలంగాణలో పాలన కొనసాగుతూ వస్తోందన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన అనుభవాలను పుస్తకంలో పొందుపర్చానని చెప్పారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ అధికారిగా పని చేసిన జోషి.. తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురావడం, ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం నడుస్తున్న తీరును పుస్తకంలో పేర్కొనడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తమకు, అధికారులకు ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుందని చెప్పారు. తక్కువ కాలంలో ఇంత మంచి పుస్తకాన్ని తెచ్చినందుకు జోషికి మంత్రి అభినందనలు తెలిపారు.