వరవరరావుకు మరింత ఊరట!
ABN , First Publish Date - 2021-10-27T08:40:36+05:30 IST
ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడైన కవి వరవరరావుకు మరికొంతకాలం ఊరట లభించింది. నవంబరు 18వరకు ఆయన తలోజా జైలు అధికారుల
- వచ్చే 18 వరకు లొంగిపోనక్కర్లేదు
ముంబై, అక్టోబరు 26: ఎల్గార్ పరిషద్ కేసులో నిందితుడైన కవి వరవరరావుకు మరికొంతకాలం ఊరట లభించింది. నవంబరు 18వరకు ఆయన తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోనక్కర్లేదని బాంబే హైకోర్టు మంగళవారం తెలిపింది. అస్వస్థత కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఆయనకు హైకోర్టు మెడికల్ బెయిలు మంజూరు చేసింది. సెప్టెంబరు 5న ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. తన మెడికల్ బెయిలును పొడిగించాల్సిందిగా కోరుతూ వరవరరావు గత నెలలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. స్వస్థలమైన హైదరాబాద్లో ఉండేందుకు ఆయన అనుమతి కోరారు. సమయభావం కారణంగా ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. మెడికల్ బెయిలు సమయంలో స్వస్థలంలో ఉండేందుకు అనుమతి కోరుతూ విడిగా మరో వ్యాజ్యం వేయాల్సిందిగా ధర్మాసనం వరవరరావుకు సూచించింది.