బట్టలపై భార్య రక్తం... భర్తకు జీవిత ఖైదు

ABN , First Publish Date - 2020-08-04T21:18:45+05:30 IST

బట్టలపై చిమ్మిన భార్య రక్తం భర్తకు శిక్షపడేలా చేసింది. ఆ రక్తపు మరకలు ఎందుకు పడ్డాయో అతను చెప్పలేకపోవడం.. భార్యను హత్య చేయలేదనేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడంతో భర్తని ముద్దాయిగా నిర్ధారిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష విధించింది. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.

బట్టలపై భార్య రక్తం... భర్తకు జీవిత ఖైదు


ముంబై : బట్టలపై చిమ్మిన భార్య రక్తం భర్తకు శిక్షపడేలా చేసింది. ఆ రక్తపు మరకలు ఎందుకు పడ్డాయో అతను చెప్పలేకపోవడం.. భార్యను హత్య చేయలేదనేందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడంతో భర్తని ముద్దాయిగా నిర్ధారిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్యను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష విధించింది. ఈ ఘటన ముంబైలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. 


నగరంలోని ములుంద్ ప్రాంతానికి చెందిన జయేష్ మండ్లేకర్(40) అదే ప్రాంతానికి చెందిన శ్రేయా(33)లది ప్ర్రేమ వివాహం. పెద్దలను ఎదిరించి పారిపోయి మరీ జరిగిన ఈ పెళ్ళి 2003 నాటిది. జయేష్ ఇంజినీర్ కాగా, శ్రేయా ఆసుపత్రిలో పనిచేసేది. వారికి 2005 లో బాబు కలిగాడు. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో అనుమాన భూతం మొదలైంది. భార్య పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని జయేష్ అనుమానం పెంచుకున్నాడు.


ఆ అనుమానంతో ఆమెను తరచూ కొట్టి హింసిస్తుండేవాడు. భర్త వేధింపులు భరించలేకపోయిన శ్రేయా 2017 లో కొడుకుతో సహా పుట్టింటికి వచ్చేసింది. ఆ తరువాత సరిగ్గా నెలరోజులకే ఆమెదారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు... భర్తే ఆమెను దారుణంగా హత్య చేసినట్లు తేల్చారు. కోర్టులో వాదనలు వినిపించే సమయంలో భార్యని తాను హత్య చేయలేదని, అసలు ఆ రోజు తాను ముంబైలో లేనని, హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పాడు.


కాగా... హత్య జరగడానికి సరిగ్గా నెలరోజుల ముందు శ్రేయా కొడుకుతో సహా తన ఇంటికి వచ్చేసిందని మృతురాలి తల్లి వెల్లడించింది. తన కుమార్తెపై అనుమానంతో హింసించేవాడని, అందుకే ఆమె తన వద్దకు వచ్చేసిందని పేర్కొంది. ఓ రోజు తమ ఇంటికొచ్చిన జయేష్... ఇంటికి రావాలంటూ శ్రేయాతో గొడవపడ్డాడని, అందుకు ఆమె నిరాకరించడంతో వెళ్లిపోయాడని చెప్పింది. జయేష్ వెళ్లిన కొద్దిసేపటికే తన కూతురు కూడా ఇంటి నుంచి బయటికెళ్లిందని, ఆసుపత్రి విధులకు వెళ్లి ఉంటుందని భావించామని పేర్కొంది.


అయితే... ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికామని, ములుంద్‌లోని అత్తింట్లో ఆమె హత్యకు గురైందని ఆమె చెప్పింది. ఆ ఇంటి పొరుగువారు కూడా ఆమె భర్త ఇంటికి రావడం చూశామని, ఇద్దరూ కలిసే వచ్చారని చెప్పారు. ఆరోజు తాను హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పిన భర్త... అందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయాడు. కనీసం రైలు టిక్కెట్ కూడా ఆయన వద్ద లేదు. అంతేకాకుండా... నిందితుడి బట్టలపై భార్య శ్రేయా రక్తం చిందిన ఆనవాళ్ళున్నాయి. ఆ రక్తం ఎందుకు పడిందో సరైన కారణాలు చెప్పలేకపోవడంతో నిందితుడే నేరం చేసినట్లుగా నిర్ధారించిన కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది

Updated Date - 2020-08-04T21:18:45+05:30 IST