దుబ్బాకలో బీజేపీ వర్సెస్ పోలీసులు
ABN , First Publish Date - 2020-10-21T08:38:51+05:30 IST
దుబ్బాకలో సోమవారం రాత్రి పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కమలం పార్టీ నేత వాహనం తనిఖీ
పోలీ్సస్టేషన్ సమీపంలో రాత్రంతా హైడ్రామా
దుబ్బాక/హైదరాబాద్, అక్టోబరు 20 : దుబ్బాకలో సోమవారం రాత్రి పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ సోషల్ మీడియా ఇన్చార్జి వంశీధర్ కారును స్థానిక పోచమ్మ ఆలయం వద్ద దుబ్బాక సీఐ హరికృష్ణగౌడ్ ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయకుండా పోలీ్సస్టేషన్ సమీపంలోని ఆర్అండ్బీ అతిథి గృహం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కారు తాళాలు, వంశీధర్ సెల్ఫోన్ తీసుకున్నారు. రాత్రి 8 గంటలకు వాహనాన్ని ఆపిన పోలీసులు 10 గంటల వరకు తనిఖీ చేయలేదు. దీంతో 11 గంటల సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు, మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండెల లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సం జయ్ కరీంనగర్ నుంచి బయలుదేరుతున్నట్టు స్పష్టం చేయడంతో పోలీసులు వంశీధర్ సెల్ఫోన్ తిరిగి ఇచ్చారు. వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని సమాచారం వచ్చిందని ఏసీపీ బాలాజీ తెలిపారు. దీంతో కారును తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చివరకు కారులో ఏమీ లేదని పోలీసులు తేల్చారు. తనిఖీ పేరుతో తమవాళ్లను వేధిస్తున్నారని రఘునందన్రావు ఆరోపించారు. పోలీసులు, అధికారుల వైఖరి చూస్తుంటే ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.