స్టేజిపైనే రెజ్లర్ చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్!

ABN , First Publish Date - 2021-12-19T00:16:35+05:30 IST

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌‌కు..

స్టేజిపైనే రెజ్లర్ చెంప చెళ్లుమనిపించిన బీజేపీ ఎంపీ.. వీడియో వైరల్!

రాంచీ: ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతున్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌‌కు హాజరైన యూపీ బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వేదికపైనే ఓ రెజ్లర్ చెంప పగలగొట్టారు. అప్పటికీ ఆగ్రహం చల్లారకపోవడంతో అతడిపైకి దూసుకెళ్లారు. దీంతో ఆహూతులు ఎంపీని అడ్డుకున్నారు.


ఎంపీ తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్లూఎఫ్ఐ) అధ్యక్షుడైన బ్రిజ్‌భూషణ్  షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో నిన్న ప్రారంభమైన పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఓ యువకుడు స్టేజిపైకి వచ్చి ఆడేందుకు తనను అనుమతించాలని ఎంపీని వేడుకున్నాడు. 15 ఏళ్ల వయసు పరిమితి దాటిపోవడంతో నిర్వాహకులు అతడిని ఆడేందుకు అనుమతించలేదు. దీంతో అతడు నేరుగా స్టేజిపైకి వెళ్లి తనను అనుమతించాలని ఎంపీని పదేపదే విజ్ఞప్తి చేశాడు.


దీంతో సహనం కోల్పోయిన ఎంపీ బ్రిజ్‌భూషణ్ అందరి ముందే అతడి చెంపలు వాయించారు. అక్కడితో ఆగక అతడిపైకి దూసుకెళ్లారు. దీంతో పక్కనున్న వారు ఎంపీని ఆపారు. 


ఎంపీ తీరుపై మండిపడిన రెజర్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ అయిన 64 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2012లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీ చేతిలో చెంపదెబ్బలు తిన్న రెజ్లర్ గోండాలోని ఆయన కోచింగ్ సెంటర్‌లోనే శిక్షణ తీసుకుంటుంటుడడం కొసమెరుపు.



Updated Date - 2021-12-19T00:16:35+05:30 IST