Somu veerraju: ‘ఓ సాధారణ మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం చరిత్రలో మరుపురానిరోజు’
ABN , First Publish Date - 2022-07-25T18:19:03+05:30 IST
ఒక సాధారణ మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం చరిత్రలో మరుపురానిరోజు అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు.
న్యూఢిల్లీ: ఒక సాధారణ మహిళ రాష్ట్రపతి పదవిని చేపట్టడం చరిత్రలో మరుపురానిరోజు అని బీజేపీ(BJP) ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు(Somu veerraju) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసి ప్రధాని మోదీ(Modi) మంచిపని చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయితీలలో రాష్ట్రపతి ఫొటోను పెట్టాలని ఏపీ బీజేపీ కోరుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో గత నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం పంపిణీ చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బియ్యం పంపిణీ నిలచిపోవడానికి కారణాలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చారని, ఈ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 5 కోట్ల నిరుపేదలు ఉన్నారని అర్ధం అవుతుందన్నారు. ఉచిత పథకాలు ఎక్కువ కావడం వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఈ విధంగా తయారయ్యిందని విమర్శించారు. గ్రామాలకు సకాలంలో నిధులు అందకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు. సర్పంచ్లకు ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ తెరచి, ఆ లింకులు పంపమంటే రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. రేపు ఈ విషయంపై కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్(Narendra singh tomar)ను కలువనున్నట్లు సోమువీర్రాజు పేర్కొన్నారు.