బీజేపీ వర్సెస్ జనసేన.. ముదిరిన వివాదం
ABN , First Publish Date - 2021-03-14T22:19:06+05:30 IST
బీజేపీ, జనసేన మధ్య వివాదం ముదురుతోంది. ఆ రెండు పార్టీల కలయిక మూన్నాళ్ల ముచ్చటగా మిగిలేట్లు ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఆదిలోనే
హైదరాబాద్: బీజేపీ, జనసేన మధ్య వివాదం ముదురుతోంది. ఆ రెండు పార్టీల కలయిక మూన్నాళ్ల ముచ్చటగా మిగిలేట్లు ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఆదిలోనే తెగిపోయే పరిస్థితి ఎదురువుతోంది. జనసేనాని పవన్కల్యాణ్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ సీరియస్గా తీసుకుంది. పొత్తు ధర్మాన్ని పవన్ విస్మరించారని ఈ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు పవన్కు కృతజ్ఞతలు తెలిపామని బీజేపీ నేతలు గుర్తుచేశారు. అయితే ఎమ్మెల్సీ పోలింగ్ రోజే టీఆర్ఎస్కు మద్దతు తెలపడంపై బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పవన్కల్యాణ్ వ్యవహారాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు.
అంతకుముందు పవన్ తెలంగాణ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము కేంద్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర శాఖ తమను అవమానించిందని మండిపడ్డారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన పార్టీ సమావేశంలో మాట్లాడారు. జనసేనను చులకన చేసేలా బీజేపీ మాట్లాడిందని ఆరోపించారు. బీజేపీ తమను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. అందుకే తాము తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి మద్దతిస్తున్నామని వెల్లడించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన మహానుభావుడని పవన్ కొనియాడారు.