ఒమన్, భారత్ మధ్య విమాన టికెట్ ధరలకు రెక్కలు!
ABN , First Publish Date - 2020-11-29T15:58:42+05:30 IST
గల్ఫ్ దేశమైన ఒమన్ నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు తాజాగా విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి.
మస్కట్: గల్ఫ్ దేశమైన ఒమన్ నుంచి భారత్లోని వివిధ గమ్యస్థానాలకు తాజాగా విమాన టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ప్రవేట్ ఎయిర్ లైన్లపై ఉన్న నిషేధాన్ని డిసెంబర్ 27 వరకు పొడిగించిన నేపథ్యంలో విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అక్టోబర్లో 50 నుంచి 80 ఒమన్ రియాల్స్గా ఉన్న ధర ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. మస్కట్, కాలికట్ మధ్య అక్టోబర్లో 50 ఒమన్ రియాల్స్(రూ.9,606) ఉంటే.. ఇప్పుడు 135 ఒమన్ రియాల్స్(రూ.25,937) అయింది. అలాగే ముంబై, మస్కట్ మధ్య 80 ఒమన్ రియాల్స్గా(రూ.15,370) ఉన్న ధర ఇప్పుడు ఏకంగా 171 ఒమన్ రియాల్స్కు(రూ.32,854) పెరిగింది. కాగా, ప్రస్తుతం నేషనల్ క్యారియర్లు ఒమన్ ఎయిర్, సలాం ఎయిర్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మాత్రమే ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.