ఫ్రెండ్స్.. నేను చనిపోయాక నా ప్రేయసిని మరో పెళ్లి చేసుకోనియొద్దు.. అంటూ వీడియో తీసి మరీ..
ABN , First Publish Date - 2021-10-28T22:51:13+05:30 IST
ఆ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. యువతి ఇంట్లో విషయం తెలిసి గొడవలు జరిగాయి. ఒకరోజు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితులకు షేర్ చేశాడు. అందులో ‘‘ఫ్రెండ్స్..
భోపాల్: ఆ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. యువతి ఇంట్లో విషయం తెలిసి గొడవలు జరిగాయి. ఒకరోజు ఆ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని స్నేహితులకు షేర్ చేశాడు. అందులో ‘‘ఫ్రెండ్స్.. నేను చనిపోయాక నా ప్రేయసిని మరో పెళ్లి చేసుకోనియొద్దు..’’ అంటూ వీడియో తీసి మరీ అతడు చేసిన పనేంటో తెలిస్తే షాకవుతారు. పూర్తి వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్లోని మండ్సౌర్ జిల్లా సండల్పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల సునీల్ వ్యవసాయం చేసేవాడు. సునీల్ సోదరుడు అనీల్కు భాన్పురలోని ఛచ్వాడకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత అనీల్తో సునీల్ కూడా అత్తారింటికి వెళ్లేవాడు. అక్కడ సునీల్కు వదిన చెల్లెలితో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే యువతి కుటుంబసభ్యులకు వారి ప్రేమ విషయం తెలిసి గతేడాది సెప్టెంబర్ 24న సునీల్పై దాడి చేశారు. తర్వాత ఇరు కుటుంబాలు భాన్పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపుడు అవమానంతో సునీల్ విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సరైన సమయంలో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించి అతడిని కాపాడారు. ఇదే క్రమంలో ఈ నెల 25న సునీల్ను యువతి తండ్రి, బంధువులు చంపేస్తానని బెదిరించి, అత్యాచారం కేసులో ఇరికిస్తానని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన సునీల్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్కు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఫ్రెండ్స్కు పంపించాడు. అందులో తను చనిపోయాక తన ప్రేయసిని మరో పెళ్లి చేసుకోనియొద్దని చెప్పాడు. ఒక నిమిషం నిడివి గల ఆ వీడియోలో చివరగా తన స్నేహితులు రాకేష్, నీలేష్లకు అతడి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోమని తెలిపాడు.
బాధితుడి మామ భాగ్చంద్ పాటిదర్ మాట్లాడుతూ.. పోలీసులు సునిల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వీడియోలు డిలీట్ చేశారని అన్నాడు. ఈ కేసుకు సంబంధించిన అనేక ఆధారాలు సునిల్ మొబైలో ఉన్నాయని అన్నారు. కానీ పోలీసులు కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించాడు. స్నేహితులకు పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని అన్నాడు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని వాపోయాడు. పోలీసు అధికారి కమలేష్ సిగార్ మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్ట్ రాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.