ఒకరు చనిపోతేనే మరొకరికి బెడ్
ABN , First Publish Date - 2021-05-09T08:40:56+05:30 IST
అది గాంధీ ఆస్పత్రి. సమయం శుక్రవారం రాత్రి 6 గంటలు. రాచకొండ మల్లయ్య అనే వ్యక్తి కరోనా సోకి తీవ్ర అస్వస్థతతో క్యాజువాలిటీ వార్డుకు వచ్చారు.
- గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి దయనీయం
- ఆస్పత్రిలో అన్ని వార్డుల్లో పడకలు ఫుల్
- జిల్లాల నుంచి అంబులెన్స్ల క్యూ
- దవాఖానా ఆవరణలోనే రోగుల అవస్థలు
- అడ్మిట్, బెడ్లపై సమాచారమిచ్చేవారేరి?
- జాడలేని డ్యూటీ ఆర్ఎంవోలు
అడ్డగుట్ట, మే 8 (ఆంధ్రజ్యోతి): అది గాంధీ ఆస్పత్రి. సమయం శుక్రవారం రాత్రి 6 గంటలు. రాచకొండ మల్లయ్య అనే వ్యక్తి కరోనా సోకి తీవ్ర అస్వస్థతతో క్యాజువాలిటీ వార్డుకు వచ్చారు. ఆస్పత్రిలో మంచాలు, ఆక్సిజన్, వెంటిలేటర్ లేదని వైద్యులు చెప్పారు. అనంతరం ఆయన రాత్రి 11 గంటలదాకా ఆస్పత్రి బయట అంబులెన్స్లోనే ఉన్నారు. చివరికి అర్ధరాత్రి 12 గంటలకు ఆరోగ్యశ్రీ వార్డులో అడ్మిట్ అయ్యారు. కొద్దిసేపటికి మూడో అంతస్తులో ఉన్న రోగుల్లో ఒకరు చనిపోతే ఆయన స్థానంలో రాచకొండ మల్లయ్యను వెంటిలేటర్పై ఉంచారు. శనివారం తెల్లవారుజామున 4గంటలకు మల్లయ్యా చనిపోయాడు. గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న దయనీయ స్థితికి ఈ ఘటనే ఉదాహరణ! జిల్లాల నుంచి ఈ పెద్దాస్పత్రికి రోగులు పోటెత్తుతుండటంతో అన్ని వార్డుల్లో బెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యాజువాలిటీ వద్ద అంబులెన్స్లు క్యూ కడుతున్నాయి. వైద్యులు కోసం రోగుల సహాయకులు చక్కర్లు కొడుతున్నారు. అడ్మిట్ చేసుకోండి సార్లూ అంటూ వైద్యులను రోగుల కుటుంబసభ్యులు, బంధువులు ప్రాధేయపడుతున్నారు.
ఆ వైద్యులేమో చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. ఆస్పత్రిలో వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టిన రోగుల్లో ఎవరైనా చనిపోతే తప్ప బయటివారిని చేర్చుకునే పరిస్థితి లేదు. దీంతో జ్వరపీడితులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నవారు ఎంతోమంది ఆస్పత్రి ఆవరణలోనే కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా పాజిటివ్తో పాటు వివిధ రుగ్మతలతో బాధపడుతున్న బాధితుల్లో అధిక శాతం గాంధీలోనే ఆడ్మిట్ అవుతున్నారు. హైదరాబాద్ పాటు వివిద జిల్లాల నుంచి వస్తున్నవారిలో ఎక్కువమంది రాత్రి వేళల్లోనే ఇక్కడికి వస్తున్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 1092రోగులు ఉన్నారు. వీరిలో 650 వెంటిలేటర్ మీద 442 ఆక్సిజన్ పడకల మీద ఉన్నారని దవాఖానా కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. కాగా సాయంత్రం ఐదు గంటల తర్వాత గాంధీ ఆస్పత్రికి రావొద్దని వైద్యులు చెబుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల్లోపు వస్తే అడ్మిట్ విషయంలో కొంత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
రాత్రిళ్లు జాడలేని ఆర్ఎంవోలు
ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల దాకా ఇద్దరు డ్యూటీ ఆర్ఎంవోలు విధుల్లో ఉండాలని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే వారు ఆస్పత్రిలో కనిపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఒక డ్యూటీ ఆర్ఎంవో క్యాజువాలిటీ వార్డులకు వచ్చే రోగులను ఆడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో డ్యూటీ ఆర్ఎంవో, ఆస్పత్రిలో ఏ వార్డులో ఎన్ని వెంటిలేటర్, ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయి అనే సమాచారాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వీరిద్దరూ రాత్రి సమయంలో కనిపించడంలేదు. ఫోన్కూ స్పందించడంలేదని తెలుస్తోంది.