ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు జట్టును ప్రకటించిన బీసీసీఐ
ABN , First Publish Date - 2021-01-20T00:35:26+05:30 IST
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లండ్ జట్టుతో తలపడబోతోంది. ఇంగ్లండ్తో జరగనున్న నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు గానూ తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్ల్లో హార్థిక్ పాండ్యా మళ్లీ జట్టులోకి రానున్నాడు. గాయాల కారణంగా ఆసీస్తో జరిగిన చివరి టెస్ట్కు దూరమైన అశ్విన్, బూమ్రా ప్రస్తుతం ఫిట్గా ఉండటంతో మళ్లీ జట్టులో చోటు దక్కింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన హనుమ విహారి, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీని ఇంగ్లండ్తో జరగనున్న రెండు టెస్ట్లకు బీసీసీఐ పక్కన పెట్టింది.
జడేజా స్థానంలో అక్సర్ పటేల్కు చోటు దక్కింది. బ్రిస్బేన్లో డెబ్యూ టెస్ట్తోనే అద్భుత ఆటతీరును కనబర్చిన వాషింగ్టన్ సుందర్ను ఇంగ్లండ్తో టెస్ట్లకూ బీసీసీఐ ఎంపిక చేసింది. ఆసీస్ టూర్లో ప్రతిభ కనబర్చిన శార్దూల్ ఠాకూర్కు కూడా చోటు దక్కింది. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్ట్లకు బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలివి..
టీమిండియా: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, పంత్, సాహా, పాండ్యా, కేఎల్ రాహుల్, బూమ్రా, ఇషాంత్, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, అశ్విన్, కుల్దీప్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్