బాతిక్‌ బాలయ్య ఇకలేరు

ABN , First Publish Date - 2020-12-24T07:37:24+05:30 IST

ప్రముఖ బాతిక్‌ చిత్రకారుడు యాసాల బాలయ్య (82) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన

బాతిక్‌ బాలయ్య ఇకలేరు

బాల్యం నుంచే చిత్రకళపై ఆసక్తి

లక్ష్మాగౌడ్‌ వద్ద ‘బాతిక్‌’లో శిక్షణ

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు

హరీశ్‌ సహా పలువురి సంతాపం

 

 సిద్దిపేట, డిసెంబరు 23 : ప్రముఖ బాతిక్‌ చిత్రకారుడు యాసాల బాలయ్య (82) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు సిద్దిపేటలో నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే చిత్రకళపై ఆసక్తి పెంచుకున్నారు. సుప్రసిద్ధ చిత్రకారులు కాపు రాజయ్య శిక్షణలో డ్రాయింగ్‌ పరీక్షలు రాశారు. 1972లో లక్ష్మాగౌడ్‌ వద్ద బాతిక్‌ చిత్రకళలో శిక్షణ పొందిన బాలయ్య సుమారు 40 ఏళ్లపాటు కొన్నివేల బాతిక్‌ చిత్రాలు వేశారు. ఆయన వేసిన చిత్రాలు దేశ, విదేశాల్లోని కళా ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి.


మళయాల మనోరమ పత్రిక ఆయన ‘గ్రామ దేవతలు’ చిత్రాన్ని వార్షిక సంచికలో ముద్రించి గౌరవించింది. దేశంలోని ప్రధాన పట్టణాలతో పాటు అమెరికాలోని పలు గ్యాలరీలలో చిత్రప్రదర్శనలు నిర్వహించారు. సాలార్జంగ్‌ మ్యూజియం, ఏపీ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మ్యూజియం, కేంద్ర లలిత కళా అకాడమీ, మద్రాసులలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం, లాస్‌ ఏంజెల్స్‌ మ్యూజియంలో ఆయన వేసిన చిత్రాలున్నాయి.


జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు.  హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ , పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నుంచీ అవార్డులు స్వీకరించారు. సీఎం కేసీఆర్‌ నుంచి గౌరవ పురస్కారం కూడా అందుకున్నారు. బాలయ్య మృతిపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పనలో ఆయన భాగస్వామ్యాన్ని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, సీఎం కార్యాలయం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌ సంతాపం తెలిపారు.


Updated Date - 2020-12-24T07:37:24+05:30 IST