AP News: పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
ABN , First Publish Date - 2022-08-02T02:52:59+05:30 IST
పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. బాపట్ల జిల్లా ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో చోటుచేసుకుంది.
బాపట్ల: పిడుగుపాటుకు ముగ్గురు మృతిచెందారు. బాపట్ల జిల్లా ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో చోటుచేసుకుంది. పశువులు మేపుకునేందుకు పొలం వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం పిడుగుపడింది. గ్రామానికి చెందిన పోతిరెడ్డి పిచ్చిరెడ్డి(48), ఆలకుంట చినరాములు(46), జెడా రామాంజమ్మ(30) ముగ్గురు సోమవారం ఉదయం బొప్పూడివారిపాలెం పొలాల వైపు వెళ్లి గేదెలు మేపుకొని వస్తుండగా ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఆ ముగ్గురు గ్రామ దేవత కాట్ల అంకమ్మ దేవాలయం సమీపంలోకి వచ్చేసరికే ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో ఆ ముగ్గురూ విరుచుకుపడిపోయి ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులకు ఘటనా స్థలానికి పరుగున వెళ్లారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఈ ఘటనతో ఈదర గ్రామంలో విషాదం అలముకుంది.