బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు
ABN , First Publish Date - 2021-04-06T00:34:21+05:30 IST
బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏబీఎన్ చేతిలో నిందితుల స్టేట్మెంట్
హైదరాబాద్: బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏబీఎన్ చేతిలో నిందితుల స్టేట్మెంట్, 4 ఎఫ్ఐఆర్ కాపీలు ఉన్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో ఇద్దరు రియల్టర్లు, 8 మంది ఈవెంట్ మేనేజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో తనీష్ని బెంగళూరు పోలీసులు విచారించారు. హైదరాబాద్ వ్యాపారవేత్త సందీప్రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. ఈవెంట్ మేనేజర్ కలహరెడ్డి, ఉద్యమకారుడు రతన్రెడ్డికి నోటీసులిచ్చారు. సందీప్, తనీష్ స్టేట్మెంట్ మేరకు 4 కేసులను పోలీసులు నమోదు చేశారు. హైదరాబాద్లోని పలు పబ్బుల్లో డ్రగ్స్ బిజినెస్పై సందీప్ సమాచారమిచ్చిన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసినా కలహర్, రతన్రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాలేదు.
కలహర్రెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లినట్లు సందీప్రెడ్డి వెల్లడించారు. ‘‘నిర్మాత శంకర్గౌడ్ ఇచ్చిన పార్టీలో కలహర్, సందీప్రెడ్డి పాల్గొన్నారు. 2019లో శంకర్ పార్టీకి ఎమ్మెల్యే, పలువురు వ్యాపారవేత్తలు హాజరైనారు. ఈ పార్టీలో కలహర్రెడ్డి, రతన్రెడ్డి, శ్రీనురెడ్డి, హీరో తనీష్, రాజశేఖర్, వికీ మల్హోత్ర డేనియల్, మస్తాన్ చంద్ పార్టీలో పాల్గొన్నారు. 3 రోజుల పాటు శంకర్గౌడ్ ఇచ్చిన పార్టీలో ఎంజాయ్ చేశాం. ఇరానీ గర్ల్స్తో కలిసి పార్టీలో డ్యాన్సులు చేశాం. హైదరాబాద్ వెళ్తూ శంకర్గౌడ్ నుంచి రతన్రెడ్డి కొకైన్ తీసుకెళ్లాడు’’ అని సందీప్ వెల్లడించారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలపైనా బెంగళూరు తూర్పు విభాగం పోలీసులు దృష్టిసారించారు. ఫిబ్రవరి నెలలో శాండల్వుడ్కు చెందిన ఓ ప్రముఖ నటుడి హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగిందని నిర్ధారించిన పోలీసులు.. అక్కడి సీసీటీవీ ఫుటేజీలను సేకరించారు. పార్టీ జరిగిన ప్రాంతంలో సీసీకెమెరాలు లేకున్నా.. ఆ సమయంలో హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కెమెరాల్లో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు, మరో ప్రజాప్రతినిధి, పలువురు ప్రముఖుల చిత్రాలు రికార్డయినట్లు సమాచారం.