కేసీఆర్ దృష్టిలో.. ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-03-04T20:59:10+05:30 IST
కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.
యాదాద్రి-భువనగిరి: కేసీఆర్ దృష్టిలో ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. గురువారం యాదాద్రి-భువనగిరిలో నిర్వహించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్, అభ్యర్థి ప్రేమందర్రెడ్డి, బీజేపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి ఓటు వేస్తే చెప్పుకు ఓటు వేసినట్లేనని తెలిపారు. సీఎం పదవిని కేసీఆర్ చెప్పుతో పోల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నయీమ్ అక్రమ ఆస్తులు మెక్కిన కేసీఆర్ చేత అన్నీ కక్కిస్తామని హెచ్చరించారు. యాద్రాది లక్ష్మీనర్సింహాస్వామి పక్కన కేసీఆర్ ఫొటో ఎప్పుడూ పెట్టమన్నాడో, అప్పటి నుంచే ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందని చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నారు. న్యాయవాది వామనరావు దంపతుల హత్యలో టీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందన్నారు. ఇప్పటివరకు సీఎం స్పందించక పోవడం సిగ్గుచేటని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి పేరుతో 70 వేలు బాకీ ఉందని చెప్పారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకమన్నాారు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఓ యుద్ధంలా జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారమవుతాయని బండి సంజయ్ తెలిపారు.