టీ20 ప్రపంచకప్ ఫైనల్.. ఆస్ట్రేలియావైపే మొగ్గుచూపిన వాసిం అక్రమ్
ABN , First Publish Date - 2021-11-15T00:25:59+05:30 IST
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్
దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. టోర్నీ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాకిస్థాన్, ఇంగ్లండ్ వంటి పెద్ద జట్లను ఓడించి ఫైనల్కు చేరిన ఆస్ట్రేలియా, కివీస్లలో కప్పు కొట్టే సామర్థ్యం ఎవరికి ఉందన్న దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
టోర్నీ ఫైనల్పై మాజీ క్రికెటర్లు ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తుండగా, పాకిస్థాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్ ఆస్ట్రేలియాపై మొగ్గు చూపాడు. న్యూజిలాండ్తో పోలిస్తే ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. టీ20లలో ఇటీవల ఆస్ట్రేలియా ప్రదర్శన బాగుందని అక్రమ్ పేర్కొన్నాడు. డేవిడ్ వార్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా టీ20ల్లో వార్నర్ చాలా దూకుడుగా ఆడతాడని పేర్కొన్నాడు. దీనికి తోడు మంచి ఫామ్లో ఉన్నాడని కితాబిచ్చాడు.
స్మిత్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆస్ట్రేలియా కూర్పు బాగుందని అన్నాడు. వారి ఫాస్ట్ బౌలింగ్ అటాక్ కూడా ఎంతో బాగుందని ప్రశంసించాడు. నాకౌట్స్లో మ్యాక్స్వెల్, స్టోయినిస్ ఫిప్త్ బౌలర్లుగా రాణించారని, న్యూజిలాండ్ వారిని ఎదుర్కోవడంపై దృష్టిసారించాలని సూచించాడు. అయితే, సెమీఫైనల్లో పాకిస్థాన్పై విజయం తర్వాత ఆస్ట్రేలియా మరింత బలంగా కనిపిస్తోందన్నాడు. ఫైనల్లో ఫేవరెట్లు ఎవరు? అని మీరు కనుక నన్ను అడిగితే ఆస్ట్రేలియాకే కొంత మొగ్గు ఉందని చెబుతానని అక్రమ్ వివరించాడు.