వాట్సాప్‌లోనే వేలం.. అమ్మాయిల ఫొటోలు పెట్టి బేరం

ABN , First Publish Date - 2022-01-29T07:24:20+05:30 IST

హైదరాబాద్‌తో పాటు.. చుట్టు పక్కల జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తిస్తారు.

వాట్సాప్‌లోనే వేలం.. అమ్మాయిల ఫొటోలు పెట్టి బేరం

  • నిరుపేద కుటుంబాలే ముఠాల లక్ష్యం
  • మహిళల అక్రమ రవాణాలో కొత్తకోణం


హైదరాబాద్‌ సిటీ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌తో పాటు.. చుట్టు పక్కల జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న నిరుపేద కుటుంబాలను గుర్తిస్తారు. వారి ఆర్థిక స్థితిగతులు, బలహీనతలను తెలుసుకుంటారు.. తమ ముఠా సభ్యులతో ఏదో ఒక రకంగా ఆ కుటుంబాలకు దగ్గరవుతారు. ఆర్థికంగా ఆదుకుంటారు. తర్వాత వారి ఆడపిల్లల ఫొటోలు తీసుకుంటారు.. వాటిని ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న వ్యక్తులకు వాట్సా్‌పలో పంపుతారు. వారికి ఆ అమ్మాయిలు నచ్చితే వాట్సా్‌పలోనే వేలం నిర్వహిస్తారు. రూ.లక్షల్లో బేరం కుదరగానే.. నయానో బయానో కుటుంబసభ్యులను ఒప్పిస్తారు. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కస్టమర్లను రప్పిస్తారు.. గుట్టుచప్పుడు కాకుండా అమ్మాయిలను విక్రయించి నగరం దాటిస్తారు. ఇలా సిటీలో పదుల సంఖ్యలో ముఠాలు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల 14 ఏళ్ల బాలికను తల్లి, అమ్మమ్మ సహకారంతో 61 ఏళ్ల వృద్ధుడికి రూ.5లక్షలకు అమ్మకానికి పెట్టిన ఉదంతం బాలాపూర్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 9 మంది ఉన్న ముఠాను రాచకొండ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ప్రస్తుతం నగరంలో మానవ అక్రమ రవాణా చాపకింద నీరులా విస్తరించిందని పోలీసులు భావిస్తున్నారు.


నగరంలో ఉన్న అక్రమ రవాణా ముఠాలు ఆటో డ్రైవర్లు, తాగుబోతు తల్లిదండ్రులు, అడ్డా కూలీలు, పనివాళ్లుగా బతుకుతున్న వారిలో ఆడపిల్లలు సంతానం ఎక్కువగా ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఠా సభ్యులు వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని ఏదో ఒక విధంగా పరిచయం పెంచుకుంటున్నారు. చిన్న ఆపదలు, కష్టాలు తీరుస్తూ ఆర్థికంగా అండగా ఉంటారు. అలా వారిని బుట్టలో వేసుకొని కొంతకాలం పాటు.. నమ్మకంగా నటిస్తారు. ’’మీ సంపాదనతో ఆడపిల్లలను పెంచడం, చదివించడం, పెళ్లిలు చేయడం చాలా కష్టమైన పని.. కాబట్టి ఇతర ప్రాంతాల్లో మాకు తెలిసిన పెద్ద సంస్థలు, సంపన్నులు ఉన్నారు. వారు నిరుపేద పిల్లలకు మంచి చదువు చెప్పించి, వారి కాళ్లమీద వారు బతికేలా చేస్తారు. వారే పెళ్లి చేసి మంచి జీవితాన్ని ఇస్తారు. అంతేకాదు.. పిల్లలను వారితో పంపితే.. మీ ఆర్థిక కష్టాలు కూడా తీరుస్తారు. అందుకు అవసరమైన డబ్బును ముందే చెల్లిస్తారు’’ అంటూ నమ్మిస్తారు. అలా వారి పిల్లల ఫొటోలు తీసుకుంటారు. వాటిని ఇతర రాష్ట్రాల్లో, అరబ్‌ దేశాల్లో ఉన్న కస్టమర్లకు వాట్సా్‌పలో పంపుతారు. కస్టమర్లు మెచ్చిన వారిని ఓకే చేస్తారు. ఒక ఫొటో ఎక్కువ మందికి నచ్చితే నగరంలో బ్రోకర్‌ ముఠాలు వాట్సా్‌పలోనే వేలం నిర్వహిస్తాయి. వేలంలో ఎక్కువ ఽధర ఇచ్చిన. వారికి ఆ అమ్మాయిని అమ్మేస్తారు. వారి మనుషులు హైదరాబాద్‌కు వచ్చి.. డబ్బులు చెల్లించి తల్లిదండ్రుల చెంత నుంచి తీసుకెళతారు. ముఠా సభ్యులు ముందుగానే వారిని ఒప్పించిన ప్రకారం.. కొంత డబ్బును చెల్లిస్తారు. తన బిడ్డ ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని తల్లిదండ్రులు పిల్లలను అప్పగిస్తున్నారని విచారణలో తేలినట్లు సమాచారం. 


రంగంలోకి దిగిన రాచకొండ పోలీసులు.. 

అక్రమ రవాణాపై మొదటి నుంచి ఉక్కుపాదం మోపుతున్న రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌.. ప్రత్యేకంగా యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. కేవలం ఒక్క రాచకొండలోనే గతేడాది 75 అక్రమ రవాణా కేసులు నమోదు చేసిన ఏహెచ్‌టీయూ టీమ్‌.. 198 మంది నేరస్థులను అరెస్టు చేసింది. వారి చెర నుంచి 249 మందిని రక్షించింది. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 56 మంది నేరగాళ్లపై పీడీయాక్టు నమోదు చేసింది. త్వరలోనే మరికొన్ని ముఠాల భరతం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-01-29T07:24:20+05:30 IST