గురుకులాల్లో హాజరు 2శాతమే!

ABN , First Publish Date - 2021-03-02T08:45:37+05:30 IST

హాస్టళ్లలో విద్యార్థులు వైరస్‌ బారిన పడిన ఘటనల నేపథ్యంలో తమ పిల్లలను గురుకులాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు.

గురుకులాల్లో హాజరు 2శాతమే!

కేజీబీవీల్లో 4 శాతమే.. కరోనా భయంతో వెనకడుగు 

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): హాస్టళ్లలో విద్యార్థులు వైరస్‌ బారిన పడిన ఘటనల నేపథ్యంలో తమ పిల్లలను గురుకులాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతుండడంతో అత్యధికులు వాటికే మొగ్గుచూపుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అన్ని ప్రభుత్వ, గురుకుల, ప్రైవేటు పాఠశాలలు గత నెల 24నుంచే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 6, 7, 8వ తరగతులున్న ప్రభుత్వ పాఠశాలలు 7986 ఉండగా వీటిలో 5.49 లక్షల మంది విద్యార్థులున్నారు. సోమవారం మొత్తం విద్యార్థుల్లో 30 శాతం మంది హాజరయ్యారు. అలాగే ప్రైవేటులో ఇది 23శాతం ఉండగా.. గురుకుల విద్యను అందించే కేజీబీవీ, సోషల్‌, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని ప్రభుత్వ గురుకులాల్లో హాజరు అతి తక్కువగా ఉంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 37 గురుకుల విద్యాసంస్థలు ఉండగా.. 8216 మంది విద్యార్థులున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 131 మంది విద్యార్థులే హాజరయ్యారు. మొత్తం విద్యార్థుల్లో ఇది 2శాతమే! 13 జిల్లాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 475కేజీబీవీల్లో మొత్తం 49,915 మంది విద్యార్థులుండగా సోమవారం కేవలం 1839 (4%) మంది మాత్రమే వచ్చారు. ఖమ్మం జిల్లాలోని 14 కేజీబీవీల్లో, వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 12 కేజీబీవీల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. 

Updated Date - 2021-03-02T08:45:37+05:30 IST