ఏటీఎం చార్జీలు మరింత ప్రియం
ABN , First Publish Date - 2021-06-11T07:32:38+05:30 IST
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీల చార్జీలు మరింత ప్రియం కానున్నాయి. నిర్ణీత ఉచిత లావాదేవీలు మించి చేసే ప్రతి లావాదేవీకి ఖాతాదారుడు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది...
- వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి
ముంబై: వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఏటీఎం లావాదేవీల చార్జీలు మరింత ప్రియం కానున్నాయి. నిర్ణీత ఉచిత లావాదేవీలు మించి చేసే ప్రతి లావాదేవీకి ఖాతాదారుడు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాంకులకు అనుమతినిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బ్యాంక్ ఖాతాదారులు, ఖాతా ఉన్న బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు జరపొచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత లావాదేవీలు చేపట్టవచ్చు. అంతకు మించితే ప్రస్తుతంఒక్కో లావాదేవీపై రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. దీన్ని ఒక రూపాయి పెంచుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. అలాగే ఇతర బ్యాంక్ ఖాతాదారుల నుంచి వసూలు చేసే ఇంటర్చేంజ్ ఫీజును కూడా ఆర్బీఐ ఆగస్టు నుంచి పెంచింది. ఒక్కో ఆర్థిక లావాదేవీ ఇంటర్చేంజ్ ఫీజుని ప్రస్తుత రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీల చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచేందుకు అనుమతించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది.