ఆసియా కప్పై డోలాయమానం?
ABN , First Publish Date - 2022-08-16T10:08:23+05:30 IST
ఆసియా కప్ టోర్నీకి రెండు వారాల సమయం కూడా లేదు. ఇప్పటికే అన్ని జట్లు తమ ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి.
వేదిక తరలింపుపై ఎటూ తేల్చని లంక సర్కారు
కొలంబో: ఆసియా కప్ టోర్నీకి రెండు వారాల సమయం కూడా లేదు. ఇప్పటికే అన్ని జట్లు తమ ఆటగాళ్ల జాబితాను వెల్లడించాయి. కానీ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్న శ్రీలంక మాత్రం ఇప్పటివరకు టీమ్ను ప్రకటించలేదు. శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక అస్థిరత కారణంగా ఈ టోర్నీని యూఏఈకి తరలించారు. ఈనెల 27 నుంచి దుబాయ్, షార్జాలలో మ్యాచ్లు జరుగనున్నాయి. అయితే సమయం సమీపిస్తున్నా లంక క్రీడా శాఖ నుంచి వేదిక మార్పుపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ), లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు గ్రీన్సిగ్నల్ లభించలేదు.
అనుమతి వస్తేనే కానీ యూఏఈలో ఏర్పాట్ల కోసం అధికారులు వెళ్లాలి. అనుమతి లభించకపోతే లంక ఆతిథ్య హక్కులను కోల్పోక తప్పదు. వాస్తవానికి ఆసియాక్పను తరలించడం లంక ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇటీవలే అక్కడ పాక్, ఆసీస్ జట్లు పర్యటించిన తరుణంలో ఆసియాకప్ను తమ దేశంలోనే నిర్వహించేలా లంక క్రికెట్ సరైన ప్రయత్నాలు చేయలేదని ఆ దేశ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే, జాతీయ క్రీడా మండలి చైర్మన్ అర్జుణ రణతుంగ ఆరోపించారు.